ఉమ్మడి రాష్ట్రంలో వివక్షకు గురైన దివ్యాంగులకు అండగా నిలిచింది తెలంగాణ సర్కార్. వివిధ పథకాలతో చేయూత ఇవ్వడంతోపాటు వారి సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తున్నది. దివ్యాంగులకు నెలనెలా పింఛన్తోపాటు రాయితీ రుణ సదుపాయం కల్పిస్తున్నది. దివ్యాంగులను వివాహం చేసుకుంటే ఆ జంటకు నగదు ప్రోత్సాహకం అందిస్తున్నది. గతంలో రూ.50 వేలు ఉన్న ప్రోత్సాహకాన్ని రూ.లక్షకు పెంచింది. అంతేకాదు, దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రత్యేక దివ్యాంగుల కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. జిల్లా స్త్రీ శిశు, వయోవృద్ధులు, దివ్యాంగులశాఖ ద్వారా ఏటా దివ్యాంగులకు ఉచితంగా సహాయ ఉపకరణాలు అందజేస్తున్నది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఉచిత శిక్షణతోపాటు భోజన సౌకర్యం కల్పిస్తున్నది. నేడు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వారి కోసం చేపట్టిన కార్యక్రమాలు, పథకాలు, అమలు తీరుపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.
ఖమ్మం వ్యవసాయం, డిసెంబర్ 2: దివ్యాంగుల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నది. వారి బాగోగులు చూస్తున్నది. ఒక్కో దివ్యాంగుడికి నెల నెలా ఠంచనుగా రూ.3,016 చొప్పున పింఛను అందజేస్తున్నది. రాయితీపై రుణ సదుపాయం కల్పిస్తున్నది. వారి అవసరాలకు అనుగుణంగా ఉపకరణాలు అందిస్తున్నది. నేడు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ‘నమస్తే’ ప్రత్యేక కథనం.
దివ్యాంగులను ఎవరైనా వివాహం చేసుకుంటే సర్కార్ ఆ జంటకు నగదు ప్రోత్సాహకం అందజేస్తున్నది. గతంలో రూ.50 వేలు ఉన్న ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం రూ.లక్షకు పెంచింది. గడిచిన ఐదేండ్లలో 186 జంటలకు రూ.1.08 కోట్ల ప్రోత్సాహకం అందించింది. దివ్యాంగులు స్వయం ఉపాధి సాధించేందుకు ప్రభుత్వం 75శాతం రాయితీతో రుణ సదుపాయం కల్పిస్తున్నది. దీనిలో భాగంగా ఐదేండ్లలో 131 మంది దివ్యాంగులు రూ.1.14 కోట్ల రుణం పొందారు. కళాశాలలో చదువుతున్న 162 మంది దివ్యాంగ విద్యార్థులు రూ.1.69 లక్షలు, పీజీ విద్యార్థులు రూ.3.33 లక్షల ఉపకార వేతనం పొందారు. వీటితో పాటు సర్కార్ ప్రతి దివ్యాంగుడికి నెల నెలా రూ.3,016 పింఛను అందజేస్తున్నది. గతంలో ఈ పింఛను కేవలం రూ.వెయ్యి మాత్రమే ఉండేది. కానీ సీఎం కేసీఆర్ దివ్యాంగుల సంక్షేమం గురించి ఆలోచించి రూ.3,016కు పెంచారు. జిల్లావ్యాప్తంగా 44,276 మంది ఖాతాల్లో ప్రతి నెలా పింఛను జమ అవుతున్నది.
దివ్యాంగుల, మానసిక, శారీరక లక్షణాలకు అనుగుణంగావారికి ప్రభుత్వం జిల్లా స్త్రీ శిశు, వయోవృద్ధులు, దివ్యాంగులశాఖ ద్వారా ఏటా ఉచితంగా సహాయ ఉపకరణాలు అందిస్తున్నది. గడిచిన ఐదేళ్లలో దివ్యాంగులకు ట్రై సైకిళ్లు 226, చంక కర్రలు, 414, వీల్చైర్స్ 185, హియరింగ్ యంత్రాలు 210, అంధుల చేతికర్రలు 53, బ్యాటరీ వీల్చైర్లు, 19, ల్యాప్ట్యాప్లు 35, మూడు చక్రాల పెట్రోల్ బండ్లు 95, ఫోర్-జి స్మార్ట్ఫోన్లు 39, బ్యాటరీ ట్రై సైకిళ్లు ఆరు అందాయి. వీటితో పాటు దివ్యాంగుల కార్పొరేషన్ అధికారులు, ఆయా స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులూ దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేస్తున్నారు.
దివ్యాంగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దివ్యాంగుల కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఒక వైపు కార్పొరేషన్, మరోవైపు దివ్యాంగుల సంక్షేమశాఖ ద్వారా దివ్యాంగులకు సహాయ సహకారాలు అందిస్తున్నది. అలాగే ఖమ్మం నగరంలో దివ్యాంగ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా వసతి గృహం ఏర్పాటైంది. ఇందులో ఉంటూ 35 మంది ఉన్నత చదువులు చదువుతున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఉచిత శిక్షణ అందుతున్నది. వీరికి సర్కార్ ఉచిత శిక్షణ, భోజన సౌకర్యం కల్పిస్తున్నది.
స్వరాష్టం వచ్చిన తర్వాత 2014-16 వరకు జిల్లావ్యాప్తంగా 97 మంది దివ్యాంగులు బ్యాక్లాగ్ నియామకాల్లో కొలువులు సాధించారు. వీరిలో బధిరులు 32 మంది, చెవిటి వారు 19 మంది, ఇతరులు 46 మంది ఉన్నారు. 2017-22 వరకు మరో 55 మంది దివ్యాంగులు బ్యాక్లాగ్ పోస్టులు సాధించారు. ఇలా మొత్తం 153 మంది ఉద్యోగాలు పొందారు. గడిచిన రెండు సంవత్సరాలకు సంబంధించిన దివ్యాంగుల కోటా ఉద్యోగాల భర్తీకి కసరత్తు జరుగుతున్నది. వివిధ కేటగిరీలకు చెందిన దివ్యాంగుల విద్యార్హత, ప్రతిభ, వయస్సు, సామాజికవర్గాల ప్రాతిపదికన ఎంపిక జరుగుతున్నది. ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉంటుంది.
ఖమ్మం నగరంలోని జడ్పీ సమవేశ మందిరంలో శనివారం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం జరుగనున్నది. కార్యక్రమానికి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, కలెక్టర్ వీపీ గౌతమ్, ఎమ్మెల్సీ తాతా మధుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకానున్నారు. ఇటీవల నగరంలో జరిగిన దివ్యాంగుల క్రీడా పోటీల్లో గెలిచిన వారికి బహుమతులు అందజేయనున్నారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న దివ్యాంగులను సత్కరించనున్నారు. స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, దివ్యాంగులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా సంక్షేమ అధికారి సంధ్యారాణి విజ్ఞప్తి చేశారు.
దివ్యాంగులు ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలి. రిజర్వేషన్లను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థానాలు అధిరోహించాలి. నిరుద్యోగులు, విద్యార్థులకు సర్కార్ అండగా నిలుస్తున్నది.శారీరక ఉపకరణాలు కావాల్సిన దివ్యాంగులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. వారికి సత్వరం ఉపకరణాలు అందేలా చూస్తాం. – సీహెచ్ సంధ్యారాణి, జిల్లా సంక్షేమశాఖ అధికారి, ఖమ్మం