మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి ఎండలు దంచుతున్నాయి. పగలు పదిగంటలు దాటకముందే మంటలు మండుతున్నాయి. గత వారంరోజులుగా ఎండలు విపరీతంగా కొడుతుండడంతో అటు వృద్ధులు, ఇటు చిన్నపిల్లలతోపాటు చిరు వ్యాపారులు తాళలేకపోతున్నారు. పాదచారులు బయటకు రావడానికి జంకుతున్నారు. అసలే ఉక్కపోతతో అవస్థలు పడుతుంటే శని, ఆదివారం కరెంటు రిపేర్ల పేరుతో తరచూ విద్యుత్ అంతరాయం ఏర్పడుతున్నది. దీంతో ఇంట్లో ఉక్కపోత.. బయటకు వస్తే ఎండకాతతో జనం బెంబేలెత్తుతున్నారు. చిరువ్యాపారులు ఎండకు తట్టుకోలేక మధ్యాహ్నానికే ఇంటిముఖం పడుతున్నారు. శీతలపానీయాల వ్యాపారులు తప్పని పరిస్థితుల్లో తలపై టవల్ కప్పుకుని వ్యాపారాలు సాగిస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 15 (నమస్తే తెలంగాణ): పగలు పదిగంటలకే ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. పదిదాటితే జనం బయటకు రాలేక నరకం చూస్తున్నారు. ఉపాధిహామీ కూలీలు, సింగరేణి కార్మికులు, చిరువ్యాపారులు ఉక్కపోతకు, ఎండకు తట్టులేక సతమతమవుతున్నారు. వైద్యశాఖ శిబిరాలను ఏర్పాటు చేసి ఓఆర్ఎస్ ప్యాకెట్లు సరఫరా చేస్తే కానీ వేసవితాపం నుంచి బయటపడే అవకాశాలు లేవని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధిహామీ కూలీలు పనులు చేయలేక ఇంటిముఖం పడుతున్నారు. తప్పని పరిస్థితుల్లో చిరువ్యాపారులు ప్రధాన కూడళ్లలోనే గొడుగులు వేసుకుని వ్యాపారాలు చేసుకుంటున్నారు.
రిపేర్ల పేరుతో కరెంటు కటింగ్లు..
అధికారికంగా కరెంటు కోతలు లేవని చెప్తున్నప్పటికీ గ్రామాల్లో మాత్రం ఏదో ఒక పేరుతో కరెంటు లేని సందర్భాలు నిత్యం కనబడుతున్నాయి. రిపేర్ల పేరుతో గంటలకొద్దీ కరెంటు లేకుండా చేయడంతో కరెంటును నమ్ముకున్న జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. అసలే ఉక్కపోతతో ఇబ్బందిపడుతుంటే అందులో కరెంటు లేకపోవడం దారుణమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఆదివారం విద్యుత్శాఖ ఏదో ఫీడర్ మరమ్మతులు అని ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ నిలిపివేయడంతో ప్రజలు ఉక్కపోతకు అల్లాడిపోతున్నారు. వృద్ధులు, చంటిపిల్లలు మరీ ఇబ్బందిపడాల్సి వస్తున్నది. ఒకవైపు నీడలా ఉండే చెట్లను కరెంటు తీగలకు అడ్డువస్తున్నాయని తొలగించడంతో దారి పొడవునా ఎండనే ఉండటంతో తలదాచుకోవడానికి కూడా నీడ కనబడటం లేదని పాదచారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎండాకాలం వచ్చిందంటే తిప్పలే..
ఎండలోనే ఉండి పండ్లు అమ్ముకుంటున్నాము. ఎండాకాలం వచ్చిందంటే మాకు భయమేస్తుంది. ఎండకు తాళలేక ఎన్నో తిప్పలు పడుతున్నాము. వాన వచ్చినా.. ఎండ వచ్చినా బతుకుదెరువు కోసం వ్యాపారం చేయాల్సిందే. ప్రభుత్వం వారు చిరువ్యారులకు కనీసం గొడుగులు సైతం ఇవ్వడం లేదు. చలివేంద్రాలు కూడా లేకుండాపోయాయి.
– మేడి సత్యవాణి, పండ్ల వ్యాపారి, కొత్తగూడెం
కరెంటు కటింగ్లు లేకుండా చూడాలి
మంచి వ్యాపార సమయానికి కరెంటు తీసేస్తున్నారు. దీంతో చాలా ఇబ్బంది అవుతున్నది. చెరుకురసం ముందే తయారుచేసి ఉంచితే కస్టమర్లు వద్దంటున్నారు. వారి కళ్లముందే చెరుకురసం తీయాలంటే కరెంటు ఉండాలి. అధికారులు దృష్టిసారించి ఎండాకాలం కరెంటు కటింగ్లు లేకుండా చూడాలి.
– జాకర్ దావీద్, చెరుకురసం వ్యాపారి, కొత్తగూడెం