ఖమ్మం వ్యవసాయం, ఫిబ్రవరి 18 : రాష్ట్ర మార్కెటింగ్ శాఖ వ్యవసాయ మార్కెట్లకు ఆదాయం సమకూర్చుకునే విషయంలో టార్గెట్ విధించింది. గత ఏడాదితో పోల్చుకుంటే.. ఈసారి మార్కెట్ల ఆదాయం భిన్నంగా కనిపిస్తుండడంతో నిర్దేశించిన లక్ష్యాలను చేరుకుంటాయా.. లేదా.. అనే సందేహం తలెత్తుతోంది. జిల్లా మార్కెటింగ్ శాఖ పరిధిలో ప్రస్తుతం ఖమ్మం మార్కెట్తోపాటు నేలకొండపల్లి, మద్దులపల్లి, సత్తుపల్లి, మధిర, వైరా, ఏన్కూర్, కల్లూరు వ్యవసాయ మార్కెట్లు ఉన్నాయి. 2023-24 సంవత్సరానికి జిల్లా మార్కెటింగ్ శాఖకు.. రాష్ట్ర మార్కెటింగ్ శాఖ రూ.54.39 కోట్ల ఆదాయం సాధించే విధంగా టార్గెట్ను విధించింది. యార్డులో జరిగే క్రయవిక్రయాలతోపాటు అనుబంధంగా ఉండే కూరగాయల మార్కెట్లు, చెక్పోస్టులు, జిన్నింగ్ మిల్లు, రైస్ మిల్లులు, కోల్డ్ స్టోరేజీలు తదితర వనరుల ద్వారా వ్యవసాయ మార్కెట్లు ఆదాయాన్ని సమకూర్చుకోవాల్సి ఉంటుంది. గత ఏడాది జనవరి పూర్తయ్యే వరకు 8 మార్కెట్లు కలిపి రూ.44.39 కోట్ల ఆదాయం సమకూర్చుకున్నాయి. ఈ ఏడాది మార్కెటింగ్ శాఖ గణాంకాల ప్రకారం రూ.46.95 కోట్ల ఆదాయం సేకరించాయి. దీంతో గత ఏడాదితో పోల్చితే రూ.3 కోట్ల ఆదాయం తక్కువగా సమకూరింది. ఏటా మార్చి నుంచి తిరిగి మార్చి వరకు గడువు ఉండగా.. మార్కెటింగ్ శాఖ విధించిన టార్గెట్ చేరుకోవాలంటే మరో 40 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ ఏడాది వానకాలం సీజన్లో ప్రధాన పంటలైన పత్తి, వరి, మిర్చి సాగు ఎక్కువైంది. కొద్ది నెలలుగా వరి, పత్తి పంట మార్కెట్కు రావడం ప్రారంభమైంది. ఈ సంవత్సరం సీసీఐ కొనుగోళ్లు చేపట్టింది. అయితే ఆశించిన మేర పంట దిగుబడులు రాకపోవడంతో మార్కెట్ల ఆదాయంపై ప్రభావం కనిపిస్తోంది. ఖమ్మం మార్కెట్ లక్ష్యాన్ని ఛేదించాలంటే మిగిలిన గడవులోగా సుమారు రూ.10 కోట్లు సంపాదించుకోవాల్సి ఉంది. మార్కెట్ల పరిధిలో ప్రస్తుతం మిర్చి, పత్తి కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. మార్చి చివరి నాటికి మరింత దృష్టి సారిస్తే ఆయా మార్కెట్లు ఆశించిన ఆదాయం పొందే అవకాశం కనిపిస్తోంది.
జిల్లా మార్కెటింగ్ శాఖ పరిధిలో ఎనిమిది మార్కెట్లు ఉండగా.. వీటిలో ఖమ్మం, ఏన్కూర్ మార్కెట్లలో మాత్రమే నిరంతరాయంగా క్రయవిక్రయాలు జరుగుతాయి. మధిర, నేలకొండపల్లి మార్కెట్లలో సీజనల్గా కొనుగోళ్లు, అమ్మకాలు చేపడతారు. మిలిగిన మార్కెట్లు ప్రత్యేక కొనుగోలు కేంద్రాలు, చెక్ పోస్టులు, జిన్నింగ్ మిల్లుల ద్వారా ఆదాయాన్ని రాబట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ ఏడాది సీసీఐ జిన్నింగ్ మిల్లుల దగ్గర మాత్రమే పత్తి కొనుగోళ్లు చేపట్టింది. దీంతో ఆయా మార్కెట్లకు అదనపు ఆదాయం సమకూరనున్నది. గత ఏడాదితో పోల్చుకుంటే పత్తి పంటకు ప్రైవేటు కేంద్రంతోపాటు సీసీఐ సైతం మద్దతు ధర పెంచింది. మిర్చి పంటకు ప్రస్తుతం గరిష్ఠ ధర క్వింటాకు రూ.22వేల వరకు ఉంది. వీటిని సద్వినియోగం చేసుకొని, తద్వారా మార్కెట్ ఫీజు వసూళ్లపై మరింత దృష్టి సారిస్తేనే రెండు నెలల్లో టార్గెట్కు చేరుకునే అవకాశం కనిపిస్తోంది.
2023-24కి గాను వ్యవసాయ మార్కెట్లు టార్గెట్ను ఛేదించే విధంగా అన్ని రకాల చర్యలు చేపడుతున్నాం. ఇప్పటికే పలుమార్లు కార్యదర్శులతో సమావేశాలు నిర్వహించాం. ఆదాయ స్థితి, నిర్దేశించిన లక్ష్యాలపై దిశానిర్దేశం చేశాం. మార్చి చివరి నాటికి ప్రతి మార్కెట్ టార్గెట్ను అధిగమించే విధంగా కార్యాచరణ సిద్ధం చేశాం. చెక్పోస్టుల నిర్వహణపై దృష్టి పెట్టాం. సీసీఐ నుంచి మార్కెట్ ఫీజు రావాల్సి ఉంది. వానకాలం సీజన్కు సంబంధించి ఐకేపీ నుంచి ఆయా మార్కెట్లకు సెస్ రావాల్సి ఉంది.