మత్స్యకారులను అన్ని విధాలా ఆదుకుంటున్నది రాష్ట్రప్రభుత్వం. వారికి రాయితీపై కచ్చు వలలు, విసురు వలలు, పాండ్రి వలలు, తెప్పలు, శీతలీకరణ పెట్టెలు, మోపెడ్స్, నాలుగు చక్రాల వాహనాలు, ప్లాస్టిక్ ట్రేలు, కాంటా, బోట్లు, పుట్లు అందిస్తున్నది. ఏటా చెరువుల్లో వందశాతం రాయితీపై చేపపిల్లలు, రొయ్య పిల్లలను వదులుతున్నది. మత్స్యకారులకు బీమా సౌకర్యం కల్పిస్తున్నది. ఇప్పటికే మత్య్సకార సొసైటీలు ఏర్పాటు చేసి మత్స్యకారులకు సబ్సిడీలు ఇస్తున్నది. తాజాగా కొత్త సంఘాల ఏర్పాటుతో పాటు కొత్తవారికి సభ్యత్వాలు ఇచ్చేలా రెండో విడత స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నది. ఏప్రిల్ 5 వరకు మత్స్యశాఖ అధికారులు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
అశ్వారావుపేట, ఫిబ్రవరి 20: కుల వృత్తుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర సర్కార్ అర్హులను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ ఫలాలు అందిస్తున్నది. దీనిలో భాగంగానే మత్స్యకారుల అభివృద్ధ్దికి ఇప్పటికే సొసైటీలు ఏర్పాటు చేసి సబ్సిడీలు అమలు చేస్తున్నది. తాజాగా కొత్త సంఘాలతో పాటు అర్హులకు సభ్యత్వాలు ఇచ్చేలా రెండో విడత స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మత్స్యశాఖ జిల్లా అధికారులు నూతన మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల రిజిస్ట్రేషన్, ప్రస్తుతం ఉన్న సంఘాల్లో అర్హులైన వారికి సభ్యత్వం కల్పించేందుకు కార్యాచరణ అమలు చేస్తున్నారు. ఏప్రిల్ 5 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
నూతన సంఘం ఏర్పాటు లేదా కొత్త సభ్యత్వం కల్పించేందుకు గ్రామంలో స్థిర నివాసం ఉన్న కనీస (11) కుటుంబాలు ఉండాలి. గ్రామంలో నీటి వనరులు వర్షాధార చెరువులైతే ఒక్కో సభ్యుడికి 2 ఎకరాలు లేదా సంవత్సరం పొడవునా నీరు నిల్వ ఉండే చెరువులైతే ఒక ఎకరా నీటి విస్తీర్ణం (మునక) ఉండాలి. గ్రామం ఏదైనా ఇతర మత్స్య సహకార సంఘం పరిధిలో ఉంటే సహకార సంఘాల చట్టం 1964లోని నిబంధనల ప్రకారం సదరు సంఘం నుంచి విడదీసి నూతన సంఘం ఏర్పాటు చేసుకోవాలి.
సంఘంలో సభ్యత్వం పొందేందుకు స్థానిక గిరిజనులు మాత్రమే అర్హులు. వారికి 18 ఏళ్లు నిండి కులం, స్థానికత ధ్రువపత్రం ఉండాలి. ఇతర వృత్తి సంఘాల్లో వారికి సభ్యత్వం ఉండకూడదు. జీవో నంబర్ 74 నిబంధనల ప్రకారం ప్రతి సంఘం నుంచి అనర్హులైన సభ్యులను తొలగించి ఏర్పడిన ఖాళీల్లో కొత్తవారికి సభ్యత్వం కల్పించాల్సి ఉన్నది. వృత్తి నైపుణ్యం లేని వారికి ప్రభుత్వమే శిక్షణ ఇస్తుంది.
జీవో ఎంఎస్ నంబర్ 98, 4 ప్రకారం గుర్తించిన (33) కులాలకు చెందిన వారు సంఘంలో చేరేందుకు అర్హులు. వారికి 18 ఏళ్లు నిండి ఉండాలి. ఒక కుటుంబం నుంచి ఒకరే అర్హులు. స్థానికత, ఆధార్, రేషన్, కుల ధ్రువీకరణ పత్రాలు సిద్ధం చేసుకోవాలి. ఉద్యోగం చేసే వారు అనర్హులు. ఇతర బలహీన వర్గాల సంఘాల్లో సభ్యత్వం ఉన్నా వారు అనర్హులే.
ప్రభుత్వం మత్సకారులకు బీమా సౌకర్యం కల్పించింది. ప్రమాదవాశత్తు మరణం లేదా శాశ్వత అంగ వైకల్యం సంభవిస్తే రూ.5 లక్షలు పాక్షిక వైకల్యం సంభవిస్తే రూ.2.50 లక్షలు, ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చేరితే రూ.25 వేల చొప్పున బాధిత కుటుంబానికి పరిహారం అందుతుంది.
సంఘంలో కొత్తగా సభ్యత్వం తీసుకునేవారికి చెరువుల్లో వల విసరడం రావాలి. ఈత తప్పనిసరి. తెప్ప మీద వెళుతూ కచ్చు వల వేయాలి. వలలు అల్లడం రావాలి. పాండ్రి వల లాగడంలో ప్రత్యేకత చూపాలి.
గిరిజన మత్స్య సంఘాలకు ఐటీడీఏ ప్రత్యేక ప్రయోజనాలు కల్పిస్తున్నది. మత్స్యకారులకు 60 శాతం రాయితీపై కచ్చు వలలు, విసురు వలలు, పాండ్రి వలలు, తెప్పలు, శీతలీకరణ పెట్టెలు, మోపెడ్స్, నాలుగు చక్రాల వాహనాలు, ప్లాస్టిక్ ట్రేలు, కాంటా, బోట్లు, పుట్లు అందిస్తున్నది. మత్స్య శాఖ సమీకృత మత్స్య అభివృద్ధి పథకంలో భాగంగా 75 నుంచి 90 శాతం రాయితీపై పైన పేర్కొన్న వాటన్నింటినీ అందిస్తున్నది. ప్రభుత్వమే ఏటా చెరువుల్లో వందశాతం రాయితీపై చేప పిల్లలు, రొయ్య పిల్లలు వదులుతున్నది.
కొత్త సభ్యులకు సభ్యత్వం ఇచ్చేందుకు ఏప్రిల్ 5వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తాం. సహకార సంఘాల చట్టం 1964 ప్రకారం కొత్త సంఘాల ఏర్పాటుతో పాటు జీవో ఎంఎస్ నెం.74 ప్రకారం సంఘాల్లో అనర్హులను తొలగించి కొత్త వారికి సభ్యత్వాలు కల్పిస్తాం. మత్స్య సహకార సంఘాలకు ప్రభుత్వం నుంచి ఎన్నో రాయితీ ప్రయోజనాలు అందిస్తున్నాం. ఈ అవకాశాన్ని మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలి.
– బానోతు వీరన్న, మత్స్యశాఖ జిల్లా అధికారి, కొత్తగూడెం