అశ్వారావుపేట, ఫిబ్రవరి 27: దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్రసర్కార్ పెద్దపీట వేస్తున్నది. ఒక్కో దివ్యాంగుడికి నెలనెలా రూ.3,016 చొప్పున ఆసరా పింఛన్ అందిస్తున్నది. వారికి అవసరమైన ఉపకరణాలను అందిస్తున్నది. సదరం క్యాంపులు నిర్వహించి వికలాంగత సర్టిఫికెట్లు అందిస్తున్నది. ‘ఆర్థిక పునరావాసం పథకం’ద్వారా సబ్సిడీపై బ్యాంక్ లింకేజీ రుణాలు మంజూరు చేస్తూ చేయూతనిస్తున్నది. వ్యవసాయం, అనుబంధ పరిశ్రమలు, వ్యాపార సంస్థలు ఏర్పాటు చేసుకోవడానికి ఈ ఏడాది కూడా దివ్యాంగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.
ఉపాధి పునరావాస పథక లబ్ధి కోసం దరఖాస్తు చేసుకునే దివ్యాంగుల వికలాంగత తప్పనిసరిగా 50 శాతం ఉండాలి. సదరం సర్టిఫికెట్ ఉండాలి. దరఖాస్తుకు కులం, ఆదాయ ధ్రువపత్రాలు, ఆధార్ కార్డు, పాస్ట్పోర్ట్ సైజు ఫొటో జత చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులకు ఈనెల 28వ తేదీ (మంగళవారం) చివరి గడువు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన దివ్యాంగుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాలకు చెందిన కుటుంబాల వార్షిక ఆదాయం రూ.2 లక్షలు ఉండాలి. గడిచిన ఐదేళ్లలో ఈ పథకాన్ని లబ్ధిపొందిన వారు అనర్హులు.
ఉపాధి పునరావాస పథకం కింద సర్కార్ జిల్లాలోని 23 మండలాలకు 30 యూనిట్లు కేటాయించింది. వీటిలో 27 యూనిట్లు రూ.50 వేలు, రూ.లక్ష యూనిట్ ఒకటి, రూ.2 లక్షల యూనిట్ ఒకటి, రూ.3 లక్షల యూనిట్ ఒకటి చొప్పున మంజూరయ్యాయి. యూనిట్ల విలువ మొత్తం రూ.19.5 లక్షలు. రూ.50 వేల యూనిట్కు పూర్తి సబ్సిడీ. రూ.లక్ష యూనిట్కు 20 శాతం లబ్ధిదారుడు తన వాటాగా చెల్లించాల్సి ఉంటుంది. రూ.2 లక్షల యూనిట్కు 30 శాతం, రూ.3 లక్షల యూనిట్కు రూ.40 శాతం చెల్లించాల్సి ఉంటుంది.
జిల్లావ్యాప్తంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న శారీరక దివ్యాంగులు 18,051 మంది, బధిరులు రూ.3,715 మంది, మానసిక దివ్యాంగులు 4,314 మంది, అంధులు 4,093 మంది ఉన్నారు. ఇలా మొత్తంగా 30,173 మంది. వీరందరికీ ప్రస్తుతం ప్రతి నెలా ఆసరా పింఛన్ అందుతున్నది. అవసరమైన వారికి ఉపకరణాలు అందాయి.
దివ్వాంగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సర్కార్ ఆర్థిక పునరావాసం పథకంలో భాగంగా బ్యాంక్ లింకేజీ రుణాలను అందిస్తున్నది. దీనిలో భాగంగా ఈ ఏడాది జిల్లాకు 30 యూనిట్లు కేటాయించింది. లబ్ధి కోసం ఇప్పటికే ఆసక్తి గల దివ్యాంగులు దరఖాస్తులు అందించారు. మంగళవారంతో దరఖాస్తుల గడువు ముగుస్తుంది.
– స్వర్ణలత లెనీనా, జిల్లా సంక్షేమాధికారి, కొత్తగూడెం