రఘునాథపాలెం, డిసెంబర్27 : ఖమ్మంలో పువ్వాడ ప్రీమియర్ క్రీకెట్ లీగ్-3 ప్రారంభమైంది. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన సోదరుడు పువ్వాడ ఉదయ్కుమార్ జ్ఞాపకార్ధం రెండేళ్లుగా పువ్వాడ ప్రీమియర్ లీగ్ పేరుతో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం లీగ్-3ని సర్దార్ పటేల్ స్టేడియం వేదికగా నిర్వహించారు. మంత్రి పువ్వాడ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, కలెక్టర్ వీపీ గౌతమ్తో కలిసి ప్రారంభించారు. ముందుగా తన సోదరుడు పువ్వాడ ఉదయ్కుమార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో క్రికెట్ క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేందుకు పీపీఎల్ పేరుతో పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ తనకెంతో సుపరిచితుడైన పువ్వాడ ఉదయ్ కుమార్ జ్ఞాపకార్ధం ఏటా క్రికెట్ లీగ్ను నిర్వహిస్తున్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ను అభినందించారు. సర్దార్ పటేల్ స్టేడియం బాణాసంచా పేలుళ్లతో దద్దరిల్లింది. కలెక్టర్ వీపీ గౌతమ్ బౌలింగ్ చేయగా ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ బ్యాటింగ్ చేసి పీపీఎల్ను ప్రారంభించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజ్, ఏఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు చంద్రావతి, ఖమ్మం నగర మేయర్ పునకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, ఏఎంసీ చైర్మన్ లక్ష్మీప్రసన్న, టీఆర్ఎస్ ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, టీఆర్ఎస్ నాయకులు ఆర్జేసీ కృష్ణ, మమత వైద్యశాల సూపరింటెండెంట్ బాగం కిషన్రావు, ఖమ్మం క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండీ మసూద్, నగర కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.