HomeKhammamThe Shape Of The Sewage Canal Changed Due To The Efforts Of Minister Puvvada Ajay Kumar
మురుగు కాలువపై సుంతర వనాలు
గోళ్లపాడు కాలువను చూసిన, తెలిసిన వారు.. ఆ పేరు వింటేనే ఒకప్పుడు ఏవగించుకునేవారు. వారే ఇప్పుడు.. ‘వాహ్.. అద్భుతం’ అంటున్నారు. దశాబ్దాలపాటు త్రీ టౌన్ ప్రజలకు నరకం చూపించిన ఆ కాలువను మురికి కూపంగా మార్చిన పాపాత్ములు
ఖమ్మం నగరంలోని త్రీ టౌన్లో అద్భుతం
బహిరంగ మురుగు కాలువ.. భూగర్భంలోకి..
దానిపై పదిచోట్ల పార్కులు సిద్ధం
నడక, ఆటలు, ఆహ్లాదం, ఆస్పత్రి.. అన్నీ ఒక్కచోటే..
మంత్రి పువ్వాడ కృషితో మారిన మురుగు కాలువ రూపురేఖలు
ఖమ్మం ఫిబ్రవరి 2: గోళ్లపాడు కాలువను చూసిన, తెలిసిన వారు.. ఆ పేరు వింటేనే ఒకప్పుడు ఏవగించుకునేవారు. వారే ఇప్పుడు.. ‘వాహ్.. అద్భుతం’ అంటున్నారు. దశాబ్దాలపాటు త్రీ టౌన్ ప్రజలకు నరకం చూపించిన ఆ కాలువను మురికి కూపంగా మార్చిన పాపాత్ములు మరెవరో కాదు.. ఆనాడు ఖమ్మం మున్సిపాలిటీని ఏలిన ‘ఎర్ర’, ‘త్రివర్ణ’ పార్టీ పెద్దలే&! దీని గురించి మరింత వివరంగా తెలుసుకోవాలనుకుంటే.. కొన్ని దశాబ్దాల వెనక్కు వెళ్లాలి.
ఇదీ చరిత్ర..
ఖమ్మం త్రీటౌన్ ప్రాంతంలోని గోళ్లపాడు కాలువ ఇప్పటిది కాదు. దీనిని దాదాపుగా వెయ్యేండ్ల క్రితం.. సాగు నీటి అవసరాల కోసం నాటి రాజులు దాదాపుగా 66 అడుగుల వెడల్పుతో తవ్వించారన్నది ఒక అంచనా. ఇది, ఖమ్మం రూరల్ మండలంలోని కామంచికల్ గ్రామ సమీపం నుంచి మున్నేరు ద్వారా ధంసలాపురం వరకు దాదాపు 11 కిలోమీటర్ల పొడవున ఉన్నది. నాడు కుగ్రామంగా ఉన్న స్తంభాద్రి (ఖమ్మం).. క్రమ క్రమేణా విస్తరించింది. సాగు భూములన్నీ ఆవాస ప్రాంతాలుగా మారాయి. దీంతో ఆ సాగు కాలువ.. క్రమేణా మురుగు కాలువగా మారింది.
మున్సిపాలిటీగా మారిన ఖమ్మాన్ని దాదాపుగా 50 ఏండ్లపాటు సీపీఎం, పదేళ్లపాటు కాంగ్రెస్ పాలించాయి. ఈ కాలువ బాగోగులను ఈ ఉభయ పార్టీల పాలకులు ఏమాత్రం పట్టించుకోలేదు. వారి అలక్ష్యంతో.. ఇంకా చెప్పాలంటే అండదండలతో ఈ కాలువను పేదల పేరుతో కొందరు పెద్దలు ఆక్రమించి గుడిసెలు వేసు(యించు)కున్నారు. ఆ తర్వాత అమ్ముకున్నారు. అలా.. అలా ఈ కాలువ కుంచించుకుపోయింది. పట్టణం విస్తరించడంతో ఆక్రమణలు కూడా పెరిగాయి. ఫలితంగా, రూరల్ మండలంలో ఈ కాలువ ఆనవాళ్లు కూడా మాయమయ్యాయి. ఖమ్మం సారథీనగర్ ప్రాంతంలోని కలెక్టర్ బంగ్లా వెనుక భాగం నుంచి వస్తున్న మురుగు నీటి కాలువ మాత్రమే గోళ్లపాడు ఛానెల్గా మున్సిపల్ కార్పొరేషన్ రికార్డుల్లో నమోదైంది.
ఇలా ఉండేది…
ఈ కాలువలో నిరంతరం మురుగు నీరు పారుతుండేది. చెత్తాచెదారంతో పూడుకుపోయేది. ఆ నీరంతా సాఫీగా పారేది కాదు. అక్కడడక్కడ నిల్వ ఉండేది. దోమలు, ఈగల ఉత్పత్తి కేంద్రంగా మారింది. పందులు స్వైర విహారం చేసేవి. చుట్టుపక్కల కొద్ది దూరం వరకు భరించలేని దుర్వాసన వస్తుండేది. ఒక మాటలో చెప్పాలంటే.. నాటి ఖమ్మం త్రీ టౌన్ ప్రాంత వాసులు నిత్య నరకం అనుభవించారు. ‘ఎర్ర’, ‘త్రివర్ణ’ పాలకులు చేసిన పాపం.. ఈ ప్రాంత ప్రజలపాలిట శాపంగా మారింది. ఇదంతా గతం.
నాడు శాపం.. నేడు వరం..
పైన చెప్పినదంతా గతం. ఇప్పుడు వర్తమానానికి వద్దాం. ఖమ్మం మున్సిపాలిటీని ఆవిర్భావం నుంచి తెలంగాణ ఏర్పడేంత వరకు ఆ రెండు పార్టీలు మాత్రమే పాలించాయి. మున్సిపల్ పాలక పగ్గాలను టీఆర్ఎస్ చేపట్టాక.. పట్టణ వాసులు ‘గులాబీ’ గుబాళింపును ఆస్వాదించసాగారు. ఖమ్మం త్రీ టౌన్ వాసులపాలిట శాపంగా మారిన గోళ్లపాడు కాలువ వరంగా మారింది. ఒక మంచి పని జరగాలన్నా.. సన్మార్గాన ముందుకు సాగాలన్నా.. ముందడుగు వేసే, ముందు చూపుతో ఆలోచించే నాయకుడు ఉండాలి. ఖమ్మం నగర ప్రజలకు అలాంటి నాయకుడు పువ్వాడ అజయ్కుమార్ రూపంలో దొరికారు. మంత్రి పదవి చేపట్టాక.. తన ఆలోచనలకు ఆచరణ రూపాన్నిచ్చారు. గోళ్లపాడు కాలువ రూపురేఖలు మార్చేందుకు ఆయన కంకణం కట్టుకున్నారు. గోళ్లపాడు స్వరూపాన్ని వివరిస్తూ, దాని రూపురేఖలను మార్చేందుకు తన వద్దనున్న ప్రణాళికను వివరిస్తూ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్కు సవివర నివేదిక సమర్పించారు. పట్టు వదలని విక్రమార్కుడిలాగా పట్టుబట్టి, గోళ్లపాడు కాలువ సుందరీకరణకు రూ.100 కోట్లు రాబట్టారు. కాలువ సుందరీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి.
మురుగు అదృశ్యం.. అందం ప్రత్యక్షం
ఒకప్పటి మురుగు కాలువ (గోళ్లపాడు) ఇప్పుడు ఎలా ఉందో చూద్దామనుకునేవారికి నిరాశే ఎదురవుతుంది..! ఎందుకంటే అది అదృశ్యమైంది కనుక..!! ఆ కాలువ ఇప్పుడు బయటకు కనిపించడం లేదు&!!! ఇదొక అద్భుతమనే చెప్పాలి. ఏం జరిగిందంటే.. ముందుగా ఆ కాలువను పూర్తిగా పూడిక తీశారు. మురుగు నీరంతా సాఫీగా వెళ్లేలా పెద్ద పెద్ద పైపులు వేశారు. వరద నీరు వెళ్లేందుకు విడిగా పైప్లైన్లు వేశారు. కాలువ పైపుల మీద పూర్తిగా కప్పు వేశారు. దాని మీద మట్టి తోలించారు. కాలువ ఉన్న ప్రాంతం పొడవునా అక్కడక్కడా పార్కులు, వాటిలో వాకింగ్ ట్రాక్లు, ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేశారు. అందుకే, మీకు ఇప్పుడు ఆ కాలువ ఆనవాళ్లు కనిపించవు. ‘మురుగు అదృశ్యమైంది.. అందం ప్రత్యక్షమైంది. శాపం పోయింది.. వరం దొరికింది..’ అంటూ త్రీ టౌన్ ప్రాంత ప్రజలు ఇప్పుడు అమితానందంతో ఉన్నారు.
వాహ్.. ఏమి అందం..!
సుమారు 11 కిలోమీటర్లు పొడవున్న కాలువపై పదిచోట్ల పార్కులు ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులను మంత్రి పువ్వాడ ఆదేశించారు. ఇప్పటికే రెండు పార్కులను ప్రారంభించారు. మరో ఎనిమిది పార్కులను ఫిబ్రవరిలో ప్రారంభించేందుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాలువపై 29వ డివిజన్లో ప్రొఫెసర్ జయశంకర్ సార్ పార్కును 600 మీటర్ల పొడవున నిర్మించారు. దీనికి ఆర్చిలు పెట్టారు. పార్కింగ్ సౌకర్యం ఉంది. పార్కులో బల్లలు, ఫౌంటేన్, గ్రీనరీ జోన్, ఆట వస్తువులు, ఓపెన్ జిమ్ ఉన్నాయి. అంతేకాదు, క్రీడాప్రాంగణం కూడా ఉంది. ఇందులో వాలీబాల్, ఖోఖో కోర్టులు, మెగా చెస్ బోర్డ్, స్కేటింగ్ రింగ్ ఉన్నాయి. రెండు వైపులా 1.2 కిలోమీటర్లు పొడవును వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు.
ఔషధ మొక్కలతో కూడిన హెర్బల్ పార్క్, పంచతత్వ జోన్, పట్టణ ప్రగతి వనం, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశారు. 34వ డివిజన్లో కొండా లక్ష్మణ్ బాపూజీ పార్క్ను నిర్మించారు. ఇందులో చిలకల ఆకారంతో ప్రవేశ ద్వారాన్ని అంకరించారు. ఇక్కడ కూడా ఫౌంటేన్, పిల్లల పార్క్, ఓపెన్ జిమ్, బాస్కెట్ బాల్ కోర్టు, క్రీడాప్రాంగణం, 600 మీటర్లు పొడవున వాకింగ్ ట్రాక్ ఉన్నాయి. 33, 34 డివిజన్ పరిధిలో కాళోజీ నారాయణరావు పార్క్ ఏర్పాటైంది. జిరాఫీ ఆకారంతో ఆర్చి నిర్మించారు. ప్లాంటేషన్, పంచతత్వ జోన్, బస్తీ దవాఖానా, వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేశారు. 30, 31 డివిజన్ పరిధిలో మంచికంటి కిషన్రావు పార్కును నిర్మించారు. పుట్టగొడుగుల ఆకారంలో ఆర్చి ఉంది. ఫౌంటేన్, ఏనుగు ఆకారంలో జారుడు బ్లల, క్రీడా ప్రాంగణం, సెంట్రల్ లైటింగ్, వాకింగ్ ట్రాక్ ఉన్నాయి.
హైదరాబాద్లో లాగా పార్కుల ఏర్పాటు
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో ఖమ్మం నగరంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. గోళ్లపాడు కాలువపై పదిచోట్ల.. హైదరాబాద్లో ఉన్నట్లుగానే పార్కులను నిర్మించాం. వీటిని అతి త్వరలోనే ఖమ్మం ప్రజల అందుబాటులోకి తెస్తాం. నగర పౌరులంతా ఆరోగ్యంగా, ఆహ్లాదంగా, సంతోషంగా ఉండాలనే లక్ష్యంతోనే ఇవన్నీ ఏర్పాటు చేశాం.