కొత్తగూడెం క్రైం, జూన్ 4: భద్రాద్రి జిల్లాలో పోలీస్శాఖ సేవలు భేష్ అని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం కొత్తగూడెం జిల్లాకేంద్రంలో భద్రాద్రి కలెక్టర్ అనుదీప్, ఎస్పీ డాక్టర్ వినీత్ గంగన్న ఆధ్వర్యంలో నిర్వహించిన సురక్షా దినోత్సవ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అనంతరం పోలీస్ హెడ్ క్వార్టర్స్లో నిర్వహించిన వేడుకలో ప్రభుత్వ విప్ మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీస్శాఖలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారన్నారు. దీనిలో భాగంగా హైదరాబాద్లో కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేశారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 11లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యత ఉందన్నారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు. గతేడాది గోదావరి వరదల సమయంలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులతో పాటు పోలీసులు విశిష్ట సేవలు అందించారని, వారి సేవలు అనుపమానమైనవని కొనియాడారు.
ప్రజలకు ఫ్రెండ్లీ పోలీసింగ్..
ఎస్పీ వినీత్ గంగన్న మాట్లాడుతూ.. ప్రజలకు ఫ్రెండ్లీ పోలిసింగ్ అందిస్తున్నామన్నారు. డయల్ 100కు 2023లో ఇప్పటివరకు 15,265 కాల్స్ వచ్చాయన్నారు. మహిళల భద్రత కోసం షీ టీమ్ బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. మహిళల సమస్యల పరిష్కారానికి ప్రతి పోలీస్ స్టేషన్లో ‘ఉమెన్ హెల్ప్ డెస్క్’ ఏర్పాటు చేశామన్నారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. 2,640 చోరీ కేసుల్లో 1,767 కేసులను ఛేదించి రూ.12,03,04,029 సొత్తును రికవరీ చేశామన్నారు. 18 మంది నేరస్తులపై పీడీ యాక్టు నమోదు చేశామన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చలాన్లు విధిస్తున్నామన్నారు. నేరాల నియంత్రణకు జిలాల్లో 6,825 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) విధానం ద్వారా మొబైల్స్ పోగొట్టుకున్న కేసులను పరిష్కరిస్తున్నామన్నారు.
మావోయిస్టుల అరాచకాలకు చెక్
తొమ్మిదేళ్లలో మావోయిస్టుల చర్యలను దీటుగా ఎదుర్కొన్నామన్నారు. దశాబ్ద కాలంలో జిల్లా పోలీసులు సుమారు 767 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశారన్నారు. 203 మంది మావోయిస్టు సానుభూతిపరులను జనజీవనంలోకి తీసుకువచ్చామన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 75 మెడికల్ క్యాంపులు నిర్వహించామన్నారు. 60వేల మందికి ఉచితంగా వైద్యసేవలు అందించామన్నారు. వారికి రూ.75లక్షల విలువ చేసే మందులను ఉచితంగా పంపిణీ చేశామన్నారు. గిరిజనులకు 2,400 వాటర్ ఫిల్టర్లు పంపిణీ చేశామన్నారు. వారి పిల్లల చదువుల కోసం 2,500 సోలార్ స్టడీ లైట్లు, క్రీడాకారులకు 250 వాలీ బాల్ కిట్లు, 128 టీవీలు, డిష్లు, 6,500 దోమ తెరలు, 650 దుప్పట్లు అందించామన్నారు. తొలుత పట్టణంలో పోలీసులు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, మెచ్చా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే హరిప్రియానాయక్, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, కలెక్టర్ అనుదీప్, ఐటీడీఏ పీవో గౌతం, డీఎఫ్వో రంజిత్ నాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్రావు, కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, అదనపు ఎస్పీ ఆపరేషన్స్ టి.సాయిమనోహర్, ఏఆర్ అదనపు ఎస్పీ విజయ్బాబు, భద్రాచలం ఏఎస్పీ పంకజ్ పరితోశ్, డీఎస్పీలు అబ్దుల్ రెహమాన్, రమణమూర్తి, రాఘవేందర్రావు, వెంకటేష్, సీఐలు, ఎస్సైలు, ఆర్ఐలు, ఆర్ఎస్సైలు పాల్గొన్నారు.