కూసుమంచి (నేలకొండపల్లి), ఫిబ్రవరి 13: ‘అంతా రామమయం.. ఈ జగమంతా రామమయం’, ‘శ్రీరామ నీ నామమెంతో రుచిరా’, ‘ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి’, ‘తక్కువేమి మనకు రాముడు ఒక్కడుండు వరకు..’, ‘నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి..’ అన్న భక్త రామదాసు కీర్తనలతో నేలకొండపల్లిలోని భక్త రామదాసు ధ్యాన మందిరం మార్మోగింది. భక్త రామదాసు జయంతి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీభక్త రామదాస విద్వత్ కళాపీఠం చైర్మన్ సాధు రాధాకృష్ణమూర్తి, సభ్యుల నేతృత్వంలో నిర్వహించిన వేడుకలు భక్తిప్రపత్తులతో సాగాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సంగీత విద్యాంసులు రాప్రోలు సుబ్రమణ్యం, శ్రీనివాసమూర్తి, డాక్టర్ ఎ.కోదండరామాచార్యులు, లలితా మహాలక్ష్మి, మాడభూషి రాజ్యలక్ష్మి, రాధికా మ్యూజిక్ అకాడమి విద్వాంసులు ఆలపించిన భక్తరామదాసు కీర్తనలు భక్తులను భక్తిపారవశ్యంలో ముంచెత్తాయి. కురిచేటి రజిని భక్త బృందం పఠించిన సుందరాకాండ పారాయణం ధ్యాన మందిరంలో ప్రతిధ్వనించింది. సికింద్రాబాద్ భక్తరామదాస సంగీత, నృత్య కళాశాల విద్యార్థులు ఆలపించిన కీర్తనలు, నృత్యప్రదర్శనలు, ఇతర కళాకారులు ప్రదర్శించిన పేరిణి నృత్య ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. కాగా, చివరి రోజు బుధవారం జరిగే ముగింపు ఉత్సవాలకు పలువురు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యే అవకాశం ఉన్నదని కళా పీఠం సభ్యులు తెలిపారు.
భద్రాచలం, ఫిబ్రవరి 13 : భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భక్త రామదాసు 391వ జయంత్యుత్సవాలు మంగళవారం రెండో రోజుకు చేరాయి. ఉత్సవాల్లో భాగంగా ఉదయం దేవస్థానం ఆస్థాన హరిదాసులు భక్త రామదాసు, తూము నర్సింహదాసు కీర్తనలు పాడి శ్రోతలను ఉర్రూతలూగించారు. అలాగే వివిధ రాష్ర్టాల నుంచి వచ్చిన కళాకారులు ఆలపించిన కీర్తనలు, భక్తి, సంగీత కార్యక్రమం, నాదస్వర కచేరీలు సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
భక్త రామదాసు జయంతి ఉత్సవాల సందర్భంగా నేలకొండపల్లి వచ్చి పేరిణి నృత్య ప్రదర్శన ఇవ్వడం నాకు ఎంతో ఆనందాన్నిచ్చింది. రామదాసు నడయాడిన ప్రాంతానికి నేను రావడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. మా బృందం గతంలో అనేక చోట్ల ప్రదర్శనలు ఇచ్చింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నేను అతి పురాతన కళ అయిన పేరిణి నృత్యాన్ని నేర్చుకున్నాను. కనుమరుగవుతున్న కళలను నేటి తరం ఔపోసన పట్టాల్సిన అవసరం ఉన్నది.