భద్రాచలం, ఏప్రిల్ 19 : ఎన్నికల నియమావళిని పక్కాగా అమలు చేయడంతోపాటు అంతర్రాష్ట్ర చెక్పోస్టుల వద్ద తనిఖీలు పకడ్బందీగా చేపట్టాలని ఎన్నికల పరిశీలకుడు రామ్కుమార్ గోపాల్ అన్నారు. శుక్రవారం భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో పినపాక అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ప్రతీక్ జైన్, భద్రాచలం అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి దామోదర్రావు, ఏఎస్పీ పరితోశ్ పంకజ్, బోర్డర్ చెక్పోస్ట్, సర్వే బృందాలతో చేపట్టాల్సిన ప్రత్యేక చర్యలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రజలు రూ.50 వేలకు మించి నగదు, రూ.10 వేలకు మించి వస్తు సామగ్రిని ఆధారాలు లేకుండా తీసుకెళ్లకూడదన్నారు.
ఎంపీ అభ్యర్థులకు సంబంధించిన వ్యక్తులు, కార్యకర్తలు ఇంటింటికి తిరిగి ప్రచారం చేయాలన్నా, సభలు, సమావేశాలు, వాహనం ఏర్పాటు చేయాలన్నా తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నారు. బార్డర్ చెక్పోస్ట్ల వద్ద విధులు నిర్వర్తించే సిబ్బంది ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. భద్రాచలం నియోజకవర్గంలో సారపాక, చర్ల రోడ్డు, కూనవరం రోడ్డులో బోర్డర్ చెక్పోస్ట్లు, పినపాక నియోజకవర్గంలో మొరంపల్లి బంజర, ఏడూళ్ల బయ్యారం, గుండాల క్రాస్రోడ్డులో చెక్పోస్టులు ఏర్పాటు చేసినట్లు ఏఈవో వివరించారు. అనంతరం సారపాక బోర్డర్ చెక్పోస్ట్ను ఆయన తనిఖీ చేశారు. కార్యక్రమంలో నోడల్ అధికారి సయ్యద్ ఖుర్షీద్, పినపాక ఏఈవో విద్యాధరరావు, వేల్పుల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.