ఖమ్మం రూరల్, ఫిబ్రవరి 4: మద్యం మత్తులో ఆకతాయిలు ఇద్దరు సాధారణ పౌరులతో పాటు పోలీసులపై దాడి చేసిన ఘటన ఆదివారం ఖమ్మం జిల్లా ‘ఖమ్మం రూరల్’ మండల పరిధిలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం నగరంలోని రేవతి సెంటర్కు చెందిన కొందరు యువకులు శనివారం అర్ధరాత్రి పూటుగా మద్యం తాగి రూరల్ మండల పరిధిలోని ధాబాకు వచ్చారు. అల్పాహారం తిన్నతర్వాత బిల్లు చెల్లించే విషయాంలో ఆకతాయిలకు యాజమాన్యానికి మధ్య వాగ్వాదం వచ్చింది. డబ్బులు చెల్లించాలని యాజమాన్యం నిలదీయడంతో యువకులు ధాబా సిబ్బందిపై కర్రలతో దాడికి దిగారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న తెల్దారుపల్లికి చెందిన యువకులు రాంబాబు, ఉపేందర్ సదరు యువకులను అడ్డుకునే ప్రయత్నం చేశారు.
మద్యం మత్తులో ఊగిపోతున్న ఆకతాయిలు రాంబాబు, ఉపేందర్పైనా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. సమాచారం అందుకున్న రూరల్ ఎస్సై సురేష్ పోలీస్ సిబ్బందితో కలిసి ధాబా వద్దకు చేరుకున్నారు. ఎస్సైతోపాటు పోలీస్ సిబ్బందిపైనా యువకులు దాడికి పాల్పడి గాయపరిచారు. ఎస్సై, పోలీసులు తీవ్రంగా స్పందించి తమదైన శైలిలో యువకుల ఆటకట్టించి వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గాయాలపాలైన రాంబాబు, ఉపేందర్ను ఖమ్మంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఘటనలో గాయపడిన ఎస్సై, పోలీస్ సిబ్బంది ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. ఆదివారం దాడికి పాల్పడిన పలువురిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.