భద్రాచలం, డిసెంబర్ 21 : భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ముక్కోటి అధ్యయనోత్సవాల్లో భాగంగా స్వామివారు గురువారం శ్రీకృష్ణావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, ఆరాధన, ఆరగింపు, సేవాకాలం నిర్వహించారు. ధనుర్మాసోత్సవాల్లో భాగంగా ఆండాళ్ అమ్మవారిని, శ్రీకృష్ణ పరమాత్మను వేంచేపు చేసి తిరుప్పావైలోని 30 పాశురాలను పఠించారు. తర్వాత స్వామివారి ఉత్సవమూర్తులు, నిత్య కల్యాణమూర్తులను బేడా మండపానికి తీసుకొచ్చి అభిషేక తిరుమంజనం చేశారు. 12 మంది ఆళ్వార్లను వేంచేపు చేసి ముందుగా విశ్వక్సేన ఆరాధన, కర్మణః పుణ్యాహవాచన చేసి హారతులు సమర్పించారు. అంతరాలయంలోకి స్వామివారిని తీసుకెళ్లి శ్రీకృష్ణుడిగా అలంకరించారు. ఒకచేతిలో వెన్న ముద్ద, మరో చేతిలో వేణువును ఉంచి సర్వాంగ సుందరంగా అలంకరించి.. బేడా మండపానికి తీసుకొచ్చి ప్రత్యేక వేదికపై వేంచేపు చేశారు. సాక్షాత్తు శ్రీరామచంద్రుడే శ్రీకృష్ణావతారంలో దర్శనమివ్వడంతో స్వామివారిని చూసి భక్తులు మురిసిపోయారు. ఆ తరువాత స్వామివారిని అంతరాలయంలోకి తీసుకెళ్లి రాజభోగం సమర్పించారు. మధ్యాహ్నం 2 గంటలకు స్వామివారిని బేడా మండపానికి తీసుకొచ్చి బంగారు ఊయలలో వేంచేపు చేసి ‘లాలలు-జోలలు’ అనే వేడుకలను వైభవంగా చేపట్టారు. మధ్యాహ్నం 3 గంటలకు స్వామివారిని సమస్త మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణలు, కోలాట నృత్యాల నడుమ అంగరంగ వైభవంగా మిథిలా స్టేడియానికి తీసుకొచ్చి ప్రత్యేక వేదికపై ఆసీనులను చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కిట్టయ్యగా దర్శనమిస్తున్న రామయ్యను చూసేందుకు భక్తులు సుదూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలి రావడంతో మిథిలా ప్రాంగణం భక్తాద్రిగా మారింది. ‘జై శ్రీరామ్, జైజై శ్రీరామ్..’ అంటూ భక్తులు జయజయధ్వానాలు చేశారు. వచ్చిన భక్తులందరికి అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. సాయంత్రం 4 గంటలకు స్వామివారికి తాతగుడి సెంటర్ వరకు తిరువీధి సేవ నిర్వహించారు. తమ ఇష్టదైవాన్ని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఫల, పుష్పాదులు, హారతులు సమర్పించి పులకించిపోయారు.
ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా ఏకాదశికి ముందు పది రోజులు పగల్ పత్తు ఉత్సవాలు, తర్వాత పది రోజులు రాపత్తు ఉత్సవాలు నిర్వహిస్తారు. శుక్రవారం పది రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో పగల్ పత్తు ఉత్సవాలు ముగుస్తాయి. శనివారం ఉదయం స్వామివారు వైకుంఠ ద్వారంలో భక్తులకు దర్శనమిస్తారు. అదేరోజు సాయంత్రం డీఎస్పీ బంగళాలో రాపత్తు ఉత్సవాలను ప్రారంభిస్తారు.
భద్రాచలం, డిసెంబర్ 21 : ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలకు విచ్చేసే భక్తులు బస చేయడానికి ఆన్లైన్ ద్వారా ద్వార దర్శనం టికెట్లు, గదులను బుక్ చేసుకోవాలని ఆర్డీవో మాలోతు మంగీలాల్ ఒక ప్రకటనలో తెలిపారు. టికెట్ల కోసం https:// bhadradritemple. telangana.gov. in వెబ్సైట్లో బుక్ చేసుకోవాలని, వసతి కోసం https:// book. bhadrachalam onl ine.com/ వెబ్సైట్ను సందర్శిం చాలని, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.