ఖమ్మం ఎడ్యుకేషన్, మే 6: 2023-24 విద్యాసంవత్సరానికి వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష(నీట్)ను ఆదివారం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. జిల్లాలోని ఐదు కేంద్రాల్లో పరీక్ష నిర్వహించేందుకు అవసరమైన సామగ్రిని సిద్ధం చేశారు. 3,118 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. జాతీయ స్థాయి పరీక్ష కావడంతో ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా పకడ్బందీగా నిర్వహించేలా, పటిష్ట విధానాన్ని అమలుపర్చేందుకు అన్ని జాగ్రత్తలు చేపట్టారు. అభ్యర్థులు నిర్దేశించిన సమయం కంటే గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. అరగంట ముందుగానే పరీక్ష కేంద్రాల గేట్లు మూసివేయనున్నట్లు ఇప్పటికే స్పష్టం చేశారు. విద్యార్థినీ విద్యార్థులు హాల్టికెట్లతోపాటు సంబంధిత దరఖాస్తును తీసుకుని కేంద్రాలకు చేరుకోవాలన్నారు. ఇప్పటికే పరీక్ష కేంద్రాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష జరగనుండగా.. మధ్యాహ్నం 12 గంటల నుంచే కేంద్రాల్లోకి అభ్యర్థులను అనుమతిస్తారు. మధ్యా హ్నం 1.30 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా కేంద్రాల్లోకి అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. పరీక్ష రాసే విద్యార్థులు పాస్పోర్ట్ సైజ్ ఫొటోను అడ్మిట్కు జత చేయాలని, మరో ఫొటోను తమ వెంట తీసుకురావాలని అధికారులు సూచించారు. గుర్తింపు కార్డు ఉంటేనే కేంద్రాల్లోకి అనుమతించనున్నారు.
పరీక్ష నిర్వహణలో కీలకమైన ఇన్విజిలేటర్లతో నగరంలోని హార్వెస్ట్ పాఠశాలలో శనివారం సమావేశం నిర్వహించారు. విద్యార్థులు పరీక్ష రాస్తున్న గదిలో ప్రతి విద్యార్థిని నిశితంగా పరిశీలించాల్సిన అంశాలు, విద్యార్థులకు సంబంధించిన ఆధారాలు నమోదు చేసేటప్పుడు, ఓఎంఆర్ పూర్తి చేసే సమయంలో ఇవ్వాల్సిన సూచనలపై అవగాహన కల్పించారు. సమావేశంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ప్రతినిధులు, కోఆర్డినేటర్ రామసహాయం పార్వతిరెడ్డి పలు సూచనలు చేశారు. కేంద్రాల్లోకి ఏయే సమయానికి చేరుకోవాలి, ఏవైనా సందేహాలుంటే వెంటనే తెలియపర్చాలని ఆమె స్పష్టం చేశారు.
ఢిల్లీలోని సెంట్రల్ బోర్డుకు చెందిన ప్రతినిధులు శనివారం నగరంలోని పలు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించి.. నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. పది మంది సీబీఎస్ఈ ప్రతినిధులు ఉన్నారు. పరీక్ష ప్రారంభం నుంచి ముగిసే వరకు ఆయా కేంద్రంలోనే ఉండి క్షుణ్ణంగా పరిశీలించనున్నారు.
– పరీక్ష కేంద్రాలు: బ్లూమింగ్ మైండ్స్ స్కూల్, వీవీసీ పబ్లిక్ స్కూల్, కవితా మెమోరియల్ డిగ్రీ, పీజీ కళాశాల, మ్యాక్స్ కళాశాల, హార్వెస్ట్ పబ్లిక్ స్కూల్.
పాల్వంచ రూరల్, మే 6: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆదివారం నిర్వహించే నీట్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎన్టీఏ కోఆర్డినేటర్ ఎంవీ.శ్రీనివాసరెడ్డి తెలిపారు. జిల్లాలోని పాల్వంచ, కొత్తగూడెం కేంద్రా ల్లో 1,080 మంది పరీక్ష రాయనున్నారని తెలిపారు. పాల్వంచలోని డీఏవీ మోడల్ స్కూల్, కొత్తగూడెంలోని సింగరేణి ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో కేంద్రాలను ఏర్పాటు చేశా రన్నారు. పరీక్ష సిబ్బందికి డీఏవీ పాఠశాలలో శనివారం శిక్షణ ఇచ్చి అవగాహన కల్పించారు. పరీక్షకు అరగంట ముందే విద్యార్థులు కేంద్రానికి చేరుకోవాలని తెలిపారు.