ఖమ్మం, మే 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): జిల్లాలో కలకలం సృష్టించిన మహిళ కిడ్నాప్, హత్య కేసు మిస్టరీ వీడింది. కేసును సీరియస్గా తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. బైక్ ఢీకొట్టడంతోనే మహిళ మృతిచెందిందని నిర్ధారించారు. ఖమ్మం నగరంలోని పోలీస్ కమిషనరేట్లో గురువారం సీపీ విష్ణు ఎస్ వారియర్ వివరాలు వెల్లడించారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం రామన్నకుంట తండాకు చెందిన బానోతు నీలమ్మ (45) తన అత్త మల్లమ్మతో కలిసి గత నెల 28న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం నగరం వచ్చారు. ఇద్దరూ కలిసి ఆటోలో ఆసుపత్రికి వెళ్తుండగా మూత్ర విసర్జన కోసం మల్లమ్మ ఆటోను ఆపించింది. డ్రైవర్ అది అవాంఛనీయ ప్రయోజనంగా భావించి ఆటోను కొంచెం ముందుకు తీసుకెళ్లాడు. మల్లమ్మ రోడ్డుపైకి వచ్చి చూడగా ఆటో కనిపించలేదు.
దీంతో ఆందోళనకు గురైన అత్త తిరిగి స్వగ్రామానికి వెళ్లింది. నీలమ్మ కుమారుడు బాలాజీకి విషయం తెలిపింది. బాలాజీ ఖమ్మానికి వచ్చి తల్లి కోసం గాలించినా ప్రయోజనం లేకపోయింది. దీంతో ఈనెల 2న ఖమ్మం టూ టౌన్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీలో ఓ మహిళ మృతదేహం ఉందని, మృతదేహాన్ని గుర్తించాలని కోరగా బాలాజీ ఆసుపత్రికి వచ్చాడు. సదరు మృతదేహం తన తల్లి నీలమ్మదేనని గుర్తించాడు. మహిళ ఎలా మృతిచెందిందన్న విషయాన్ని తేల్చేందుకు పోలీసుశాఖ దర్యాప్తునకు మూడు బృందాలను రంగంలోకి దింపింది. పోలీసులు నగర పరిధిలోని అనేక సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. తొలుత కిడ్నాప్, హత్య కోణంలో విచారించిన పోలీసులు ద్విచక్రవాహనం ఢీకొట్టడంతోనే నీలమ్మ మృతిచెందిందని ఫుటేజీలో గుర్తించారు.
గత నెల 28వ తేదీ 9.20 గంటల సమయంలో మృతురాలి అత్త మల్లమ్మ మూత్ర విసర్జన కోసం రోడ్డు పక్కకు వెళ్లిన తర్వాత డ్రైవర్ ఆటోను ముందుకు తీసుకెళ్లాడు. కొంతసేపటి తర్వాత నీలమ్మ ఆటో దిగి చైతన్య నగర్ క్రాస్ రోడ్ దాటుతుండగా ఆమెను బైక్ ఢీకొట్టింది. అనంతరం బైకర్ అక్కడి నుంచి ఉడాయించాడు. కొద్దిసేపటి తర్వాత అటుగా వెళ్తున్న ఆటోడ్రైవర్ కోటమర్తి వెంకటేశ్వర్లు ఆటోను ఆపాడు. మానవతా దృక్పథంతో రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన నీలమ్మను ఖమ్మంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించాడు.
వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తుండగా ఇదే రోజు మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో మృతిచెందింది. ఈ విషయం ఆమె కుటుంబ సభ్యులకు తెలియకపోవడంతో నీలమ్మను గుర్తుతెలియని ఆటో డ్రైవర్ కిడ్నాప్ చేసి హతమార్చినట్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సీపీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని ద్విచక్రవాహనదారుడిని గుర్తించారు. అనతికాలంలోనే కేసును ఛేదించిన అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్తోపాటు ఖమ్మం టౌన్ ఏసీపీ గణేష్, ట్రైనీ ఐపీఎస్ అవినాష్ కుమార్, సీసీఎస్ ఎసీపీ రవికుమార్ను సీపీ అభినందించారు.