ఖమ్మం వ్యవసాయం, జనవరి 18 : ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి పంట ధరలు స్టాక్ మార్కెట్ షేర్ల ధరలకంటే ఎత్తుపల్లాలను చూస్తున్నాయి. రైతులు పంటను తక్కువగా తెచ్చిన రోజు వ్యాపారులు ధరలు అమాంతం పెంచుతున్నారు. ఆ ధరలను పోల్చుకొని అన్నదాతలు అధికంగా పంటను తెచ్చిన రోజు సదరు వ్యాపారులు ఆ పంట ధరలను అంతే గణనీయంగా తగ్గిస్తున్నారు. ఇలాంటి ధరల దగా ఇక్కడ పరిపాటిగా మారింది. సాధారణంగా మార్కెట్లో ఏ వస్తువులకైనా, పంట ఉత్పత్తులకైనా ‘డిమాండ్సైప్లె’ సూత్రం వర్తిస్తుంది. దాని ప్రకారమే ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. అధిక దిగుబడులు వచ్చినప్పుడు, ఏక పంట మాత్రమే సాగైనప్పుడు సహజంగానే పంట ధరలు తగ్గుతాయి. పంట సాగు చేసిన రైతులు కూడా మార్కెట్లో ధరలను సీజన్కు ముందుగానే అంచనా వేస్తారు. అయితే, ఈ ఏడాది ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో విచిత్రమైన పరిస్థితి కన్పిస్తోంది.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మిర్చి రైతులు ఈ స్థితి ఎదుర్కొంటున్నారు. నిరుడు మార్కెట్లో మిర్చి పంటకు డిమాండ్ ఉండి.. క్వింటాకు రూ.25 వేలకు పైగానే ధర పలికింది. దీంతో ఇళ్లలో, కోల్డ్ స్టోరేజీల్లో పంటలను నిల్వ పెట్టుకున్న రైతులు.. ఆ పంటను పూర్తిగా అమ్మేశారు. వ్యాపారులు కూడా కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ పెట్టిన పంటను ఇతర రాష్ర్టాల వ్యాపారులకు విక్రయించారు. దీంతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కోల్డ్ స్టోరేజీల్లోనూ నిల్వలు ఖాళీ అయ్యాయి.
దీంతో ఈ వానకాలం సీజన్లో పంటను సాగు చేసిన రైతులు.. ధరలపై గంపెడాశలు పెట్టుకున్నారు. అయితే పంటలకు చీడపీడలు ఆశించడం, సాగునీటి కొరత ఏర్పడడం తదితర కారణాలతో దిగుబడులు పూర్తిగా తగ్గిపోయాయి. దీంతో చేతికొచ్చిన కొద్ది పంటైనా సిరులు కురిపించడం ఖాయమని అనుకున్నారు. ధరల విషయంలో అధికారులు కూడా అలాగే అంచనా వేశారు. అయితే మిర్చి ఖరీదుదారులు సీజన్ ఆరంభంలో కొంతమేర ఆశించిన ధర పెట్టినప్పటికీ.. తీరా పంట చేతికొచ్చే సమయంలో రోజురోజుకూ ధరలను తగ్గించుకుంటూ వస్తున్నారు. ఇటీవల సంక్రాంతి సెలవుల ముందు మార్కెట్ను అంచనా వేసిన రైతులు.. ఇప్పట్లో మంచి ధరలు రావని అంచనా వేసి నిల్వ చేయాలనే ఆలోచనకు వచ్చారు. అయితే, సెలవుల అనంతరం బుధవారం మార్కెట్లో తిరిగి క్రయవిక్రయాలు ప్రారంభం కాగా.. కొందరు వ్యాపారులు రూ.21,300 చొప్పున గరిష్ఠ ధర పెట్టి కొనుగోలు చేశారు. దీంతో మళ్లీ రైతుల ఆశల చిగురించడంతో బుధవారం వివిధ జిల్లాల నుంచి ఖమ్మం మిర్చి యార్డుకు భారీగా పంటను తెచ్చారు. రైతుల బలహీనతను కనిపెట్టారో ఖరీదుదారులు మరోసారి ధరలను అమాంతం తగ్గించారు.
మార్కెటింగ్ శాఖ వరంగల్ రీజియన్ డిప్యూటీ డైరెక్టర్ రాజునాయక్ గురువారం కూడా ఖమ్మం ఏఎంసీలో క్రయవిక్రయాలను పరిశీలించారు. ప్రస్తుతం ఖమ్మం ఏఎంసీకి పాలకవర్గం లేకపోవడం, ఉన్నతశ్రేణి కార్యదర్శి సైతం బదిలీ కావడం, అసిస్టెంట్ సెక్రటరీ నియామకం జరగకపోవడం వంటి కారణాలతో పర్యవేక్షణ సక్రమంగా జరగడం లేదు. జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి సైతం లేకపోవడంతో కొత్తగూడెం డీఎంవోనే రెండు జిల్లాల డీఎంవోగా విధులు నిర్వహిస్తున్నారు. దీంతో స్వయంగా డీడీనే ఏఎంసీలో ఉంటూ గ్రేడ్ టూ అధికారి బజార్తో కలిసి యార్డులో క్రయవిక్రయాలను పర్యవేక్షిస్తున్నారు.
ప్రతి సీజన్లోనూ వ్యాపారులు ధరల పేరిట తమను దగా చేస్తూనే ఉన్నారని రైతులు వాపోతున్నారు. అందుకు అనుగుణంగానే పరిస్థితులు కన్పిస్తున్నాయి. వరుస సెలవుల అనంతరం బుధవారం మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. తొలిరోజున జెండాపాటలో మిర్చి ధరను క్వింటాకు రూ.21,300గా వ్యాపారులు ఖరారు చేశారు. అయితే ఆ రోజున రైతులు తక్కువ మొత్తంలోనే పంటను తెచ్చారు. మంచి ధర ఉందనే ఉద్దేశంతో గురువారం రికార్డు స్థాయిలో 30 వేల బస్తాలను రైతులు తీసుకొచ్చారు. అనంతరం జరిగిన జెండాపాటలో ఖరీదుదారులు గడిచిన రోజుకంటే రూ.800 తగ్గించారు. రూ.20,500నే గరిష్ఠ ధరగా పెట్టారు. తర్వాతి గ్రేడుల పంటలను కూడా తగ్గింపు ధరలకే కొనుగోలు చేశారు. దీంతో రైతులందరూ ఆందోళనతో నిట్టూర్చారు. కొందరు రైతులు ఇక తప్పనిసరి పరిస్థితుల్లో తగ్గింపు ధరకే పంటను అమ్ముకున్నారు. మరికొందరు రైతులు పంటను కోల్డ్ స్టోరేజీలకు తీసుకెళ్లారు. విదేశాలకు ఎగుమతులు లేవని వ్యాపారులు చెప్పుకుంటున్నప్పటికీ ఒక్క రోజులోనే ధరను ఇంతలా తగ్గించడంపై సర్వత్రా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.