కూసుమంచి/ కొత్తగూడెం ఎడ్యుకేషన్, ఏప్రిల్ 29: 2023-2024 విద్యాసంవత్సరంలో పాలేరులోని జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరో తరగతిలో ప్రవేశం కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ప్రవేశ పరీక్ష శనివారం ప్రశాంతంగా ముగిసింది. ఖమ్మం జిల్లాలోని 19 కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగినట్లు నవోదయ ప్రిన్సిపాల్ చంద్రబాబు తెలిపారు. ఈ పరీక్షల కోసం జిల్లాలో మొత్తం 4,308 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 575 మంది గైర్హాజరైనట్లు చెప్పారు. అన్ని కేంద్రాల్లో పకడ్బందీగా పరీక్షలను నిర్వహించినట్లు చెప్పారు. జిల్లాలోని పలు కేంద్రాల్లో విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేశారని వివరించారు. మధిర, ఖమ్మం, కేంద్రాలను తాము తనిఖీ చేసినట్లు తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మొత్తం 9 పరీక్షా కేంద్రాల్లో శనివారం జేఎన్వీఎస్టీ 23వ (జవహర్ నవోదయ విద్యాలయ సెక్షన్ టెస్టు) ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని డీఈవో సోమశేఖరశర్మ తెలిపారు. జిల్లాల మొత్తం 1,952 మంది విద్యార్థులు రిజిస్టర్ కాగా 1,696 మంది హాజరయ్యారని, 256 మంది గైర్హాజరయ్యారని వివరించారు. నవోదయ అధికారులు ఆయా పరీక్షా కేంద్రాలను సందర్శించారు. ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు పరీక్ష జరిగింది. విద్యార్థులు గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. డీఈవో సోమశేఖరశర్మ, ఏసీజీఈ మాధవరావుతోపాటు ఇతర అధికారులు పరీక్షా కేంద్రాలను పరిశీలించారు.