రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘మన ఊరు – మన బడి’తో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయి. సకల సౌకర్యాలతో బడులు అందుబాటులోకి వస్తున్నాయి.. మొదటి విడతకు ఎంపికైన స్కూళ్లలో ఈ నెల 1న జిల్లావ్యాప్తంగా 32 సర్కార్ బడులు ప్రారంభమయ్యాయి. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కొత్తగూడెం ఎడ్యుకేషన్, ఫిబ్రవరి 5: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ‘మన ఊరు – మన బడి’తో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయి. సకల సౌకర్యాలతో ప్రభుత్వ పాఠశాలలు రూపుదిద్దుకుంటున్నాయి. దీనిలో భాగంగా ఈనెల 1న జిల్లావ్యాప్తంగా 32 సర్కార్ బడులు ప్రారంభమయ్యాయి. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రారంభమైన పాఠశాలల్లో హనుమాన్ బస్తీ పాఠశాల ఒకటి. ప్రభుత్వం రూ.13.50 లక్షల నిధులతో పాఠశాలలో అన్ని వసతులు కల్పించింది. మేజర్, మైనర్ రిపేర్లు పూర్తి చేసింది. టాయిలెట్లు, గదుల్లో టైల్స్ వేయించింది. కిచెన్ షెడ్లు నిర్మించింది. రన్నింగ్ వాటర్ కోసం సుమారు రూ.4 లక్షలు వెచ్చించింది. తాగునీటి కోసం ట్యాంక్ అందుబాటులోకి వచ్చింది. పాఠశాలలో విద్యుద్దీకరణ పూర్తయింది. పాఠశాల ఎదుట సువిశాలమైన గ్రౌండ్లో విద్యార్థులు ఆడుకునేందుకు ఆట స్థలం సిద్ధమైంది. గార్డెనింగ్ స్కూల్కు ప్రత్యేక ఆకర్షణ. ఇప్పుడు ఈ పాఠశాలలో అడ్మీషన్లు పొందేందుకు గట్టి పోటీ ఉండడం విశేషం.
ఇందిరానగర్ పాఠశాలకు రాష్ట్రంలోనే మోడల్ స్కూల్గా గుర్తింపు ఉంది. గతంలో పట్టుమని పది మంది విద్యార్థులు లేని పాఠశాలలో ఇప్పుడు విద్యార్థుల సంఖ్య 150 మంది అంటే స్కూల్ క్రెడిబిలిటీని అర్థం చేసుకోవచ్చు. ప్రైవేట్ పాఠశాలలకు ఏ మాత్రం తీసిపోకుండా యాజమాన్యం రూ.4.77 లక్షలు నిధులతో విద్యుద్దీకరణ పనులు చేయించింది. వరండాకు గ్రిల్స్, వంటగదికి వాల్, సపోర్టు వాల్స్ నిర్మించింది. టాయిలెట్లలో వాష్ బేషిన్లు ఏర్పాటు చేసింది. గోడలకు గ్రీన్ చార్ట్ బోర్డ్స్లు అమర్చింది. విద్యార్థులు కూర్చోడానికి డ్యూయల్ డెస్క్లు అందుబాటులోకి వచ్చాయి.
మా కుమార్తెను మేదరబస్తీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేర్పించాను. సర్కార్ బడి అంటే గతంలో మంచి అభిప్రాయం ఉండేది కాదు. టీచర్లు సరిగా రారు.. రూములు బాగుండవు… అనుకునే వాళ్లం. వసతులు అంతంత మాత్రంగా ఉండేవి. కానీ సీఎం కేసీఆర్ ‘మన ఊరు- మన బడి’ని అమలు చేసి విద్యార్థులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. దీంతో పిల్లలు, వారి తల్లిదండ్రులు ఎంతో ఆనందపడుతున్నారు. వేలకు వేలు ఫీజులు కట్టలేని మా లాంటి పేదలకు ప్రభుత్వ పాఠశాలపై నమ్మకం కలిగించిన కేసీఆర్కు కృతజ్ఞతలు.
– వంశీకృష్ణ, విద్యార్థిని తండ్రి, కొత్తగూడెం