భద్రాద్రి కొత్తగూడెం, జూలై 23 (నమస్తే తెలంగాణ) : సింగరేణి నిర్వాసితుల ఇళ్ల స్థలాలకు త్వరలోనే మోక్షం కలగనుంది. కొత్తగూడెం నియోజకవర్గం రుద్రంపూర్, వెంకటేశ్ గని, మాయాబజార్, సుభాష్ చంద్రబోస్ నగర్లో ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు స్థలాలు ఇప్పించడం కోసం ఎమ్మెల్యే వనమా చేస్తున్న ప్రయత్నం ఎట్టకేలకు ఫలించబోతుంది. నిర్వాసితుల కోసం ఇప్పటికే కొత్తగూడెంలో 17 ఎకరాల స్థలాన్ని కేటాయించినప్పటికీ సాంకేతిక సమస్యతో నిలిచిపోయింది. దీంతో ఈ సమస్యను ఎమ్మెల్యే వనమా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యకు పరిష్కారం చూపాలని సీఎం.. సింగరేణి సీఎండీ శ్రీధర్ను ఆదేశించడంతోపాటు సీఎస్ శాంతికుమారికి కూడా చెప్పారు. దీంతో నిర్వాసితుల ఇళ్ల స్థలాల సమస్య కొలిక్కి వచ్చినట్లయింది. ఈ మేరకు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు శనివారం సీఎం కేసీఆర్ను కలిసి వినతిపత్రాన్ని కూడా సమర్పించారు.
నియోజకవర్గ అభివృద్ధికి రూ.215కోట్లు
కొత్తగూడెం నియోజకవర్గం జిల్లా కేంద్రం కావడంతో అభివృద్ధికి నిధులు తప్పనిసరి కావాల్సి ఉంది. ఇటీవల కలెక్టరేట్ సముదాయం ప్రారంభోత్సవానికి విచ్చేసిన సీఎం కేసీఆర్ను సభలో ఎమ్మెల్యే వనమా నిధుల గురించి అడగ్గా.. అక్కడికక్కడే నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీల అభివృద్ధికి రూ.215కోట్లు మంజూరు చేశారు. ఇందుకు సంబంధించి మంజూరు ఉత్తర్వులు కూడా ఇటీవలే విడుదల చేయడంతో రెండు మున్సిపాలిటీల్లో టెండర్ల ప్రక్రియను కూడా పూర్తి చేశారు. ఇప్పటికే 398 పనులను గుర్తించారు. సోమవారం నుంచి ఇంటింటికీ వనమా తిరిగే కార్యక్రమాన్ని చేపట్టిపనులు ప్రారంభించడానికి సన్నాహాలు చేయనున్నారు. ప్రతి వార్డు, ప్రతి పంచాయతీల్లో పనులను గుర్తించి కమ్యూనిటీ హాళ్లు, రోడ్లు, సీసీ డ్రైన్లు, అంగన్వాడీ భవనాలు, మన ఊరు-మనబడి కింద పాఠశాలల మరమ్మతులు పూర్తి చేయనున్నారు.
286 మందికి ఇళ్ల స్థలాలు
చుంచుపల్లి మండలం సింగరేణి ఏరియాలో వెంకటేష్ గని ప్రాంతంలో వనమా నగర్, మాయాబజార్, ఎస్ఆర్టీ నగర్లో నిర్వాసితులకు ఇప్పటికే రెవెన్యూ శాఖ నోటీసులు కూడా జారీ చేసింది. అదే ప్రాంతంలో బొగ్గు ప్రాజెక్టు నిర్మాణం జరగబోతుందని, ఇళ్లు ఖాళీ చేయాలని కూడా పేర్కొంది. దీంతో వనమా నగర్లో 61 మంది, మాయాబజార్లో 83 మంది, ఎస్ఆర్టీ నగర్లో 83 మంది ఇండ్లు కోల్పోనున్నారు. దీంతోపాటు జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇవ్వడం కోసం స్థలాన్ని సేకరించారు.
అభివృద్ధే నా లక్ష్యం
వార్డు మెంబర్ నుంచి మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది. ఎమ్మెల్యేగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే నా లక్ష్యం. కొత్తగూడెం జిల్లా కేంద్రం కావడంతో అభివృద్ధి కోసం సీఎంను నిధులు కావాలని కోరాను. వెంటనే స్పందించి మంజూరు చేశారు. దీంతోపాటు నిర్వాసితులకు ఇళ్ల స్థలాల కోసం విన్నవించగా.. ఆయన స్పందించారు. వెంటనే సీఎండీ శ్రీధర్ను, సీఎస్ను ఆదేశించారు. సీఎం కేసీఆర్కు ఎప్పడూ రుణపడి ఉంటాను.
– వనమా వెంకటేశ్వరరావు, ఎమ్మెల్యే, కొత్తగూడెం