రఘునాథపాలెం, ఫిబ్రవరి 14 : విద్యుత్ వినియోగంలో తలెత్తే సమస్యల పరిష్కారానికి ఫోరం చక్కటి వేదిక అని తెలంగాణ ఎన్పీడీసీఎల్ విద్యుత్ వినియోగదారుల ఫోరం చైర్మన్ కే తిరుమల్రావు పేర్కొన్నారు. బుధవారం మంచుకొండ సబ్స్టేషన్లో జరిగిన విద్యుత్ వినియోగదారుల అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాదికాలంగా రాష్ట్ర ఉత్తర ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ 10 జిల్లాల పరిధిలో అనేక వేదికలను నిర్వహించిందన్నారు. వీటిద్వారా 489 సమస్యలకు పరిష్కారం చూపినట్లు తెలిపారు. మరో 123 సమస్యలను పరిష్కరించాల్సి ఉందన్నారు. వినియోగదారులకు ఇబ్బంది కలిగించిన విద్యుత్శాఖ ఉద్యోగులు, సిబ్బంది ద్వారా రూ.1.53 లక్షల 70వేల ఫెనాల్టీగా వసూలు చేసి వినియోగదారులకు చెల్లించడం జరిగిందన్నారు.
విద్యుత్ సమస్యలు, కోర్టు కేసులు, విద్యుత్ చౌర్యం మినహా మిగిలిన అన్ని సమస్యలకు వేదికలో పరిష్కారం లభిస్తుందన్నారు. వినియోగదారులు ఎలాంటి రుసుము చెల్లించకుండానే ఫోరంలో సమస్యలను పరిష్కరించుకోవచ్చునన్నారు. ఇంటినుంచే ఫోన్, ఈ మెయిల్, ఆన్లైన్, వాట్సాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చన్నారు. 9440811299, 9491307004 నెంబర్లకు ఫోన్ చేయవచ్చన్నారు. ఫోరం ఇచ్చిన తీర్పు నచ్చకపోతే విద్యుత్ నియంత్రణ మండలి నియమించిన విద్యుత్ అంబుడ్స్మెన్కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఈ ఫోరంలో టెక్నికల్ ఫైనాన్స్ మెంబర్లు చరణ్దాస్, ఎస్ నరేందర్, విద్యుత్శాఖ డీఈలు రామారావు, బాబూరావు, ఏడీఈ సంజీవ్కుమార్, ఏఈలు పాల్గొన్నారు.