మామిళ్లగూడెం, జనవరి 28: ఈవీఎం గిడ్డంగుల వద్ద విధులు నిర్వర్తించే గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. పోలీసు సిబ్బంది కూడా సీసీ టీవీ కెమెరాల ద్వారా ఫుటేజీలను నిరంతం పర్యవేక్షిస్తుండాలని ఆదేశించారు. పాత కలెక్టరేట్ గోదామును నుంచి జిల్లా పరిషత్ కార్యాలయ గోదాముకు ఈవీఎంలను తరలిస్తున్న ప్రక్రియను శనివారం ఆయన పరిశీలించారు. పాత కలెక్టరేట్ను ప్రభుత్వ వైద్య కళాశాలకు కేటాయించిన సందర్భంగా ఇక్కడి గోదాములో ఉన్న ఈవీఎంలను జడ్పీలోని స్ట్రాంగ్ రూమ్కు తరలిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా జిల్లాకు నూతనంగా వచ్చిన 2,603 బ్యాలెట్ యూనిట్లు, 2,034 కంట్రోల్ యూనిట్లను కూడా జడ్పీలోని స్ట్రాంగ్ రూమ్లో భద్రపర్చి సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు.
అదనపు కలెక్టర్ ఎన్.మధుసూదన్, డీఆర్వో శిరీష, ఆర్డీవోలు రవీంద్రనాథ్, సూర్యనారాయణ, ఈసీఐఎల్ ఇంజినీర్లు భానుప్రకాశ్, రాజుశేషు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దశరథ్, పీఆర్ ఈఈ శ్రీనివాసరావు, ఎలక్షన్ తహసీల్దార్ శ్రీనివాసరావు, రాంబాబు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పగడాల నాగరాజు, విద్యాసాగర్, గోపాల్రావు, కృష్ణమోహన్, లక్ష్మీనారాయణ, ప్రకాశ్ పాల్గొన్నారు.