అశ్వారావుపేట, జనవరి 21: ఈ ఏడాది నుంచి పదోతరగతి విద్యార్థులు ఆరు సబ్జెక్టులకు ఏడు ప్రశ్నాపత్రాలను ఏడు రోజుల్లో రాయాల్సి ఉంటుంది. రాష్ట్రవిద్యాశాఖ సైన్స్ సబ్జెక్ట్కు సంబంధించిన భౌతికశాస్త్రం, జీవశాస్త్ర పరీక్షలను ఒకేరోజు కాకుండా రెండు రోజుల్లో నిర్వహించాలని నిర్ణయించింది. భౌతికశాస్త్ర ప్రశ్నాపత్రం 50 మార్కులు, జీవశాస్త్ర ప్రశ్నాపత్రం 50 మార్కులకు ఉంటుంది. మిగతా ఐదు సబ్జెక్టుల్లో ఒక్కో ప్రశ్నాపత్రం 100 మార్కులకు ఉంటుంది. పరీక్షలు మార్చి 18న ప్రారంభమై ఏప్రిల్ 2న ముగుస్తాయి.
గతంలో సైన్స్ పరీక్షలు ఒకేరోజు జరిగేవి. దీంతో విద్యార్థులు ఇబ్బందిపడేవారు. కొందరు ఆందోళనలో పరీక్షలు సరిగా రాసేవారు కారు. కొందరు పరీక్షలు ఫెయిల్ అయ్యేవారు. ఫలితంగా జిల్లాల వారీగా ఉత్తీర్ణతశాతమూ తగ్గేది. దీంతో రాష్ట్ర విద్యాశాఖ సైన్స్ రెండు ప్రశ్నాపత్రాలను రెండు రోజులు నిర్వహించాలని నిర్ణయించింది. విద్యార్థుల ఆకాంక్ష మేరకే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది.
జిల్లాలోలోని 304 ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు, కేజీబీవీ, ఐటీడీఏ, బీసీ వెల్ఫేర్, రెసిడెన్షియల్, మైనార్టీ, సోషల్ వెల్ఫేర్ విద్యాలయాల్లో 12,341 మంది పదోతరగతి చదువుతున్నారు. వీరిలో బాలురు 5,900 మంది, బాలికలు 6,441 మంది. వీరంతా మార్చి 18 నుంచి పబ్లిక్ పరీక్షలకు హాజరుకానున్నారు. ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్ష రాస్తారు. సైన్స్కు సంబంధించిన రెండు పరీక్షలు మాత్రం ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు జరుగుతాయి.
పదోతరగతి పరీక్షల్లో ఈసారి ఆరు సబ్జెక్టులకు ఏడు ప్రశ్నాపత్రాలు ఉంటాయి. సైన్స్లో భౌతికశాస్త్ర ప్రశ్నాపత్రం 50 మార్కులు, జీవశాస్త్ర ప్రశ్నాపత్రం 50 మార్కులకు ఉంటుంది.మిగతా ప్రశ్నాపత్రాలు 100 మార్కులకు ఉంటాయి. మార్చి 18 నుంచి పరీక్షలు ప్రారంభమై ఏప్రిల్ 2న ముగుస్తాయి.