రైతులకు పత్తి పంట సిరులు కురిపిస్తున్నది. ప్రతి యేట దూదిపంట లాభసాటిగా ఉండడంతో ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ ఏడాది 1,60,900 ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు. సుజాతనగర్, జూలూరుపాడు సబ్మార్కెట్లలో పత్తి విక్రయాలు జోరందుకున్నాయి. ఇప్పటికే 23,442 మెట్రిక్ టన్నుల పత్తిని కొనుగోలు చేశారు. మార్కెట్ రేటు కంటే ప్రైవేటుగా ధర ఎక్కువగా ఉండడంతో రైతుల వద్ద నుంచి నేరుగా ట్రేడర్స్ కొనుగోళ్లు చేస్తున్నారు. గతేడాది క్వింటాల్ పత్తి రూ.8 వేలు ఉండగా ఈ ఏడాది మొదటి నుంచే రూ.8,500 నుంచి రూ.9 వేల వరకు ధర పలుకుతున్నది. పత్తి విక్రయాలు జోరుగా సాగుతుండడంతో కూలీలకు చేతినిండా పని లభిస్తున్నది. సబ్మార్కెట్లు తెల్లబంగారంతో తళుక్కున మెరుస్తున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): గతేడాదితో పోల్చితే ఈ ఏడాది పత్తి పంటను రైతులు ఎక్కువగానే సాగు చేశారు. నాలుగేళ్ల నుంచి పత్తి సాగు విస్తీర్ణాన్ని పెంచుకుంటూ వస్తున్నారు. ప్రభుత్వం గిట్టుబాటు ధరను పెంచుకుంటూ పోతుండటంతో రైతులు పత్తిపై ఆశలు పెట్టుకున్నారు. దీనికితోడు పంటలకు సకాలంలో వర్షాలు రావడం, చెరువుల్లో పుష్కలంగా నీరు ఉండడంతో అధిక దిగుబడులు ఆశిస్తున్నారు. ఐదేండ్ల నుంచి పత్తి సాగులో లాభాలు చూడడంతో రైతులంతా ఆసక్తి చూపుతున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు వస్తుండడంతోపాటు గిట్టుబాటు ధర అనుకూలంగా ఉండడంతో సాగుపై మక్కువ చూపిస్తున్నారు. ప్రభుత్వం సైతం లాభసాటి పంటలపై అవగాహన కల్పిస్తుండడంతో ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.
ఏడాదిపాటు కూలీలకు ఉపాధి
పత్తి పంట రైతులకు లాభాలు తెచ్చిపెట్టడంతోపాటు కూలీలకు ఉపాధి చూపిస్తున్నది. పత్తి ధర ప్రతి ఏటా పెరుగుతుండడంతో రైతులు కూలీలకు రోజుకూలి కాకుండా కిలోల చొప్పున పత్తితీతకు కూలి ఇస్తున్నారు. దీంతో కూలీలకు రోజుకు రూ.700 మించి కూలి పడుతున్నది. కేవలం 5 గంటల్లోనే వారికి రోజు కూలిని మించి గిట్టుబాటవుతుంది. పత్తి లోడింగ్ కూలీలకు రోజుకు రూ.1000 కూలి పడుతున్నది. దీంతో సబ్యార్డుల్లో ఆరునెలల వరకు 500మంది కూలీలకు పక్కాగా ఉపాధి దొరుకుతున్నది. సుజాతనగర్, జూలూరుపాడు మార్కెట్యార్డులో సుమారు 1,400 మంది కూలీలు ఉపాధి పొందుతున్నారు.
ఆటోలు, ట్రాలీలకు గిరాకీ
పత్తిని మార్కెట్కు తీసుకురావడం కోసం ఆటోట్రాలీలు, టాటా ఏస్లు, మినీ లారీలకు భలే గిరాకీ లభిస్తున్నది. ఉదయం కూలీలను పత్తి చేలల్లో దించి సాయంత్రం అవే వాహనాల్లో పత్తి లోడును వేసుకుని మార్కెట్కు రావడంతో రెండు కిరాయిలు కలిసొస్తున్నాయి. దీంతో ఆరునెలల వరకు రవాణా పరంగా డ్రైవర్లకు ఉపాధి దొరుకుతున్నది. ఇటు హమాలీలు, పత్తితీత కూలీలు, ఆటోడ్రైవర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
బయట మార్కెట్కే రైతుల మొగ్గు
మార్కెటింగ్ అధికారులు జిల్లాలో నాలుగు చోట్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ రైతులు బయట మార్కెట్కే మొగ్గు చూపుతున్నారు. సుజాతనగర్ మండలంలో మంజిత్ కాటన్మిల్, ఇల్లెందు పరిధి కారేపల్లిలో శ్రీలక్ష్మి కాటన్మిల్, బూర్గంపాడు వద్ద లక్ష్మీపురంలో అనుశ్రీ కాటన్మిల్, అశ్వాపురంలో శ్రీలక్ష్మి కాటన్మిల్ వద్ద కొనుగోళ్లు చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. పత్తిని ఆరబెట్టడానికి షెడ్లు కూడా అందుబాటులో ఉంచారు. తాగునీరు, టాయ్లెట్స్ ఏర్పాట్లు చేశారు. మద్దతు ధరకు మించి ట్రేడర్స్ రేటు పెంచడంతో రైతులు తెల్లవారేసరికి సబ్మార్కెట్లో విక్రయాలు జరుపుతున్నారు.
చేతినిండా పని దొరుకుతున్నది..
పత్తి పంటకు బాగా రేటు ఉంది. ఆరునెలలపాటు పనికి మాకు ఢోకా లేదు. ఉదయం వచ్చి లారీల్లో పత్తిని లోడింగ్ చేస్తున్నాం. రోజు కూలి కంటే ఎక్కువ వస్తున్నది. ఇక్కడ కూడా అన్ని సౌకర్యాలను ట్రేడర్స్ ఏర్పాటు చేశారు. తాగునీరు, విశ్రాంతి తీసుకోవడానికి టెంట్లు వేశారు. పత్తి అయ్యాక మిర్చి కొనుగోళ్లు ఉంటాయి. మాకు పని దొరికితే చాలు. ప్రతి ఏటా కూలిని వెతుక్కునే పని లేకుండా పోయింది. – రామకృష్ణ, చీపురుగూడెం, జూలూరుపాడు
ఉపాధికి కొదువలేదు..
పత్తిలోడు చేసుకుంటే రోజుకు రూ.900 పైనే కూలి పడుతున్నది. ఒక్కోసారి రూ.వెయ్యి కూడా వస్తున్నాయి. జూలూరుపాడు మండలం నుంచి వచ్చి సాయంత్రం వరకు పనులు చేసుకుని ఇంటికి వెళ్తున్నాం. సుజాతనగర్ మండలం నుంచి కూడా చాలామంది వచ్చి పని చేస్తున్నారు. ఇక్కడ మార్కెట్ లేకపోతే మేము పని కోసం దూరం వెళ్లాల్సి వచ్చేది. రైతులు సల్లంగా ఉంటే మాకు ఉపాధికి కొదువలేదు.
– ప్రసాద్, సీతంపేటబంజర, సుజాతనగర్
రైతులకు లాభసాటిగా పత్తిసాగు
పత్తి పంట రైతులకు లాభసాటిగా ఉంది. ఎంఎస్పీ రేటు కంటే సబ్మార్కెట్లో ట్రేడర్స్ రేటు ఎక్కువ పెట్టడం వల్ల రైతులు అక్కడే విక్రయాలు చేస్తున్నారు. ఇంటికే వచ్చి ట్రేడర్స్ కొనుగోలు చేయడం వల్ల రైతులకు రవాణా ఖర్చులు తగ్గుతున్నాయి. ముఖ్యంగా కూలీలకు చేతినిండా ఉపాధి దొరికింది. కూలీలు, రైతులకు సౌకర్యాలు కల్పించాలని ట్రేడర్స్కు చెప్పాం. తనిఖీలు కూడా చేస్తున్నాం.
– ఆలీ, జిల్లా మార్కెటింగ్ అధికారి