భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): పంచాయతీ ఎన్నికల్లో చతికిలపడిన కాంగ్రెస్ ప్రభుత్వం.. మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలవలేమనే ఉద్దేశంతో బీఆర్ఎస్ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తూ డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని రాజ్యసభ సభ్యుడు, పార్లమెంట్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్ర మండిపడ్డారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెం, సుజాతనగర్ ప్రాంతాల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం గురువారం ఆయన ఇంటింటి ప్రచారం చేశారు. బూడిదగడ్డలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు.
భద్రాద్రి జిల్లాలో రెండు మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ గెలవబోతున్నదని స్పష్టం చేశారు. బొగ్గు కుంభకోణంలో ఇరుక్కున్న కాంగ్రెస్ మంత్రులు ఇప్పుడు నీతులు చెబుతున్నారని, ఎప్పుడో పాత కేనును బయటకు తీసి ఫోన్ ట్యాపింగ్ పేరుతో మా నాయకులను అబాసుపాలు చేయాలని చూడడం సరికాదన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజలు మాత్రం బీఆర్ఎస్కే పట్టం కడతారని, ప్రజల్లో నుంచి వస్తున్న స్పందననుబట్టి ఇది అర్థమవుతుందన్నారు. రైతులకు పంటల పెట్టుబడి కోసం రైతుభరోసా ఇవ్వలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని విమర్శించారు.
రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో పట్టణాలు కళావిహీనంగా మారాయన్నారు. అనంతరం కొత్తగూడెంలోని బూడిదగడ్డ, హనుమాన్ బస్తీ, 25వ వార్డుల్లో ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. ప్రజలకు కాంగ్రెస్ బాకీపడిన బాకీ కార్డులను ఇంటింటికీ తిరుగుతూ పంపిణీ చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థులను మెజార్టీతో గెలిపించాలని కార్నర్ మీటింగ్లలో కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, మాజీ వైస్ చైర్మన్ దామోదర్, కొట్టి వెంకటేశ్వర్లు, నవతన్, అభ్యర్థులు వీరమ్మ, ప్రసాద్, శివకృష్ణ, అంబుల వేణుగోపాల్, చంతల కనకయ్య తదితరులు పాల్గొన్నారు.
పాల్వంచలో ‘వనమా’ ప్రచారం
మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ పట్టణంలో గల నాలుగు డివిజన్లలో మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు ముమ్మర ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం ఖాయమన్నారు. కొత్త పింఛన్లు ఇస్తానని చెప్పిన ప్రభుత్వం వాటిని విస్మరించిందన్నారు. వనమా రాఘవేంద్రరావు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.