పత్తి రైతుకు కేంద్ర ప్రభుత్వం శఠగోపం పెట్టింది. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే పత్తి పంటపై ఉన్న సుంకాన్ని ఎత్తివేయడంతో దేశీయ రైతులు ఆందోళన చెందుతున్నారు. దీని ప్రభావం మద్దతు ధరపైనా పడనుంది. ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే తక్కువకే విక్రయించుకుంటున్న పత్తి రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. పెరుగుతున్న పత్తి సాగు విస్తీర్ణానికి అనుగుణంగానే పెట్టుబడి ఖర్చులు పెరిగిపోతుండడంతో అప్పులపాలవుతున్నారు. భద్రాద్రి జిల్లావ్యాప్తంగా 5.92 లక్షల ఎకరాల్లో అన్ని రకాల పంటలు సాగవుతుండగా.. అందులో 2.17 లక్షల ఎకరాల్లో ఒక్క పత్తి పంటనే రైతులు పండిస్తున్నారు.
పత్తి దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం సుంకాన్ని ఎత్తివేసింది. దేశంలో పంట చేతికి అందే కీలక సమయానికి పత్తి దిగుమతిపై ఉన్న 11 శాతం సుంకాన్ని తగ్గించడంతో స్పిన్నింగ్ మిల్లులు విదేశాల నుంచి పంట దిగుమతితోపాటు నిల్వ చేసుకునే అవకాశం కల్పించింది. మొదట సుమారు 40 రోజులపాటు సెప్టెంబర్ 30 వరకు దిగుమతి సుంకం ఎత్తివేసిన కేంద్రం.. తర్వాత డిసెంబర్ 31 వరకు పొడిగించింది. మిల్లర్ల ఒత్తిడి మేరకే కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి పంట దిగుమతులు చేసుకునేలా సుంకం భారాన్ని తగ్గించిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత సీజన్లో ధరపై కచ్చితంగా తీవ్ర ప్రభావం ఉంటుందని పత్తి రైతులు భావిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రైతులు, రైతు సంఘం నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మద్దతు ధర కంటే వ్యాపారులు తక్కువ ధరకే పత్తి పంటను కొనుగోలు చేస్తున్నారు. సీసీఐ కేంద్రాలు ఉన్న ప్రాంతాల్లోనూ నాణ్యత సాకుగా మద్దతు ధరకు అటు, ఇటుగా రైతులు విక్రయించుకుంటున్నారు. పెట్టుబడి తెచ్చుకుని వ్యవసాయం చేసే రైతుల పరిస్థితి మరింత దీనంగా ఉంటోంది. వడ్డీ వ్యాపారి చెప్పిన ధరకే పంటను విక్రయించుకోవాల్సిన దుస్థితి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ధర మరింత తగ్గిపోతుందేమోననే ఆవేదన రైతుల్లో కనిపిస్తోంది. సెప్టెంబర్ 30 వరకే సుంకం ఎత్తివేత అని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం తర్వాత దానిని డిసెంబర్ 31 వరకు పొడిగించింది. దీంతో రైతు ప్రయోజనాలను విస్మరించిందనే ఆరోపణలు కేంద్ర ప్రభుత్వం ఎదుర్కొంటోంది.
భద్రాద్రి జిల్లాలో పెరుగుతున్న పత్తి సాగుకు అనుగుణంగానే పెట్టుబడులు కూడా రైతులకు ఆర్థిక భారంగా తయారవుతున్నాయి. ఒక్కో ఎకరం సాగు ఖర్చు సుమారు రూ.35 వేల నుంచి రూ.50 వేల వరకూ అవుతోంది. సొంత భూమి ఉన్న రైతుల ఖర్చు రూ.30 వేలకు పైగానే ఉంటోంది. కౌలు రైతులు రూ.50 వేలకు పైగానే పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. దిగుబడి సగటున 6 క్వింటాళ్లు ఉంటే.. పొట్టి రకం రూ.46 వేలు, పొడుగు రకం రూ.48 వేల మధ్య ఆదాయం లభిస్తుంది. ఈ లెక్కన రైతుకు నష్టమే తప్ప లాభాలు కనిపించడం లేదు. శ్రమను కూడా నష్టపోవాల్సి వస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు పంట కొనాల్సి ఉన్నా.. రైతు చేతికి పంట అందే సమయానికి ఏదో ఒక సమస్య వెంటాడుతోంది. తేమ శాతాన్ని సాకుగా చూపుతుండడంతో తక్కువ ధరకే రైతులు అమ్ముకోవాల్సి వస్తోంది. దిగుమతి సుంకం ఎత్తివేయడం వల్ల పత్తి రైతులు క్వింటాకు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు నష్టపోవచ్చని రైతు సంఘం నాయకులు అంచనా వేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఏటా పత్తి సాగు పెరుగుతోంది. 2023-24 సీజన్లో మొత్తం పంటలు 5,47,954 ఎకరాల్లో సాగు అవగా.. ఇందులో పత్తి సాగు 2,02,262 ఎకరాలు ఉంది. అలాగే 2024-25 సీజన్లో 5,90,680 మొత్తం సాగు విస్తీర్ణంలో పత్తి సాగు 2,03,560 ఎకరాలు, 2025-26 సీజన్లో 5.92 లక్షల ఎకరాలకు పత్తి 2.17 లక్షల ఎకరాల్లో సాగవుతోంది.
పత్తి సాగుతో ఏటా నష్టాలే వస్తున్నాయి. సాగు ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. పంట దిగుబడులు ఆశించిన స్థాయిలో ఉండడం లేదు. దీనికి తోడు వ్యాపారులు మద్దతు ధర కంటే తక్కువకే కొనుగోలు చేస్తున్నారు. ఆదాయం లేకపోగా చేసిన శ్రమ కూడా నష్టపోతున్నాం. కేంద్ర ప్రభుత్వం సుంకం ఎత్తివేయడం వల్ల ధర మరింత తగ్గిపోతుంది. మరింతగా పత్తి రైతులు నష్టపోతారు.
వ్యవసాయాన్ని, రైతు సంక్షేమాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోంది. కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చేలా నల్ల చట్టాలను తీసుకొస్తోంది. స్పిన్నింగ్ మిల్లులకు ఉపయుక్తంగా దిగుమతి సుంకం ఎత్తివేసింది. మిల్లర్లు, వ్యాపారులు విదేశాల నుంచి దిగుమతి చేసుకుని పత్తి నిల్వ చేసుకుంటారు. వ్యాపారులు స్వదేశీ పంట కొనుగోలు చేయకపోవడంతో ధర పడిపోతుంది. రైతులు తీవ్రంగా నష్టపోతారు.