పేదల పొట్టగొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కుట్రకు తెరలేపింది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి ప్రజలపై మోయలేని భారం వేసిన బీజేపీ సర్కారు.. తాజాగా పేదల ఉపాధిని దెబ్బతీసేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నది. గ్రామాల్లో వలసలను నివారించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతున్నది. కొత్త నిబంధనల పేరుతో ఉపాధి పథకంలో కోతలు విధించడంతో పేదలపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఒక్కో గ్రామ పంచాయతీలో 40 పనులకుపైగా చేసుకోవచ్చని గతంలో ఉండగా.. దాన్ని కేవలం 20 పనులకు కుదించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధనతో తమ ఉపాధికి గండిపడుతుందని కూలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేదల జీవితాలతో చెలగాటమాడుతున్న మోదీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నారు. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది సుమారు 35 వేల పని దినాలను తగ్గించింది. వచ్చే ఏడాది మరో 40వేల పని దినాలు తగ్గిస్తే రెండేళ్లలోనే ఉపాధి కూలీలు సుమారు 75 వేల పని దినాలను కోల్పోక తప్పదు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రోజూవారీ కనీస వేతనం కూడా కూలీలకు దక్కని దుస్థితి నెలకొన్నది.
అశ్వారావుపేట, డిసెంబర్ 6 : కూలీలు ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లకుండా స్థానికంగానే ఉపాధి కల్పించాలనే ప్రధాన ఉద్దేశంతో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం కొన్నేళ్లుగా అమలు చేస్తున్నది. పని చేసే కూలీలకు రోజూవారీ కనీస వేతనం రూ.257 ప్రకటించింది. ఇందుకుగాను గ్రామ పంచాయతీల్లో స్థానికంగా పనులు గుర్తించి అవసరమైన బడ్జెట్ అంచనాలను అధికారులు అంచనాలు సిద్ధం చేస్తారు. గ్రామసభల్లో ఆమోదం పొందిన పనులను ఏడాది పాటు చేస్తారు. గత ఏడాది వరకు ఒక్కొ గ్రామ పంచాయతీలో 40 పనుల వరకు చేసుకోవచ్చనే నిబంధన ఉంది. కానీ ఈ ఏడాది పనుల సంఖ్యను సగానికి తగ్గించి 20 పనులు మాత్రమే చేసుకోవాలని కొత్తగా పరిమితిని విధించింది. ఈ కొత్త నిబంధన కూలీల ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపనున్నది. కరువు పరిస్థితులను అధిగమించి నిరుపేద కూలీల కడుపు నింపుతున్న ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తున్నది. దీనివల్ల ఉపాధి పనులను నమ్ముకుని బతుకుతున్న వేల మంది కూలీలు పనులకు దూరమయ్యే దుస్థితి నెలకొంది. ఉపాధి పనులను భారీగా తగ్గించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం కూలీల కడుపు కొడుతున్నది.
జిల్లాలో 32,603 మంది కూలీలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా 15,807 జాబ్కార్డులు ఉన్నాయి. వీటిలో 32,603 మంది కూలీలు నమోదై ఉన్నారు. 7,711 జాబ్కార్డుల్లోని 12,856 మంది కూలీలు రోజూ వారి ఉపాధి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. గత ఏడాది ఉపాధి కూలీలకు 2,71,644 పని దినాలు కల్పించిన కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది వాటి సంఖ్యను 2,37,024కు తగ్గించింది. అంటే ఏడాదిలో 35వేల పని దినాలు తగ్గాయి. వచ్చే ఏడాది మరో 40 వేల పని దినాలు తగ్గవచ్చని కూలీలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ లెక్కన రెండేళ్లలోనే 75వేలకు పైనా ఉపాధి పని దినాల్లో కోల్పోవాల్సి వస్తుంది. రోజూ వారీ కనీస వేతనం రూ.257 ప్రకటించినప్పటికీ కూలీలకు గత ఏడాది సరాసరి రూ.253.70 అందగా ఈ ఏడాది కేవలం రూ.148.72 మాత్రమే. దీనికి ప్రధాన కారణం పనుల సంఖ్యను భారీగా తగ్గించడమేనని కూలీలు మండిపడుతున్నారు. గతేడాది కూలీల పని దినాలకు రూ.8.06 కోట్లు కేటాయించగా ఇందులో కూలీలకు వేతనంగా రూ.4.42 కోట్లు అందాయి. ఈ ఏడాది రూ.5.33 కోట్లకు బడ్జెట్ తగ్గింది. కూలీలు కూడా రూ.3.41 కోట్లే వేతనంగా అందుకున్నారు. అంటే సుమారు రూ.1.01 కోట్ల వేతనాన్ని కోల్పోయారు. వచ్చే ఏడాది మరో రూ.2 కోట్లకు పనులు తగ్గవచ్చని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కూలీలకు తప్పని తిప్పలు
కేంద్ర ప్రభుత్వం ఉపాధి పనుల నిర్వహణలో తీసుకొచ్చిన కొత్త సాఫ్ట్వేర్తో కూలీలకు తప్పలు తిప్పేటట్లు లేదు. ఇప్పటివరకు ఉదయం మాత్రమే ఉపాధి పనులు చేసుకున్న కూలీలు కొత్త సాఫ్ట్వేర్ వల్ల ఉదయం, సాయంత్రం కూడా పనులకు హాజరుకావాలని నిబంధన పెట్టింది. ఉదయం 11గంటలలోపు ఒక ఫొటో, సాయంత్రం 2గంటల తర్వాత మరో ఫొటో తీసి సాఫ్ట్వేర్లో అప్లోడ్ చేయాలి. ఒక గ్రామ పంచాయతీలో చేపట్టిన పని పూర్తి అయిన తర్వాతనే మరో పని చేపట్టాలన్న షరతు ఉంది. దీనివల్ల గతంలో మాదిరిగా కాకుండా పనుల్లో చాలా ఆలస్యం అవుతున్నాయి. అంతేకాకుండా రోజూ చేపట్టే పనులను వెంటనే యాప్లో పొందపరచాలనే నిబంధన క్షేత్రస్థాయిలో సిగ్నల్ లేక యాప్లో అప్లోడ్ చేయడం ఇబ్బందికరంగా మారి పనుల్లో జాప్యం జరుగుతోంది. మరోపక్క ధాన్యం ఆరబోసుకోవడానికి కల్లాల నిర్మాణాన్ని పథకం నుంచి తొలిగించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కూలీ కుటుంబానికి 100రోజుల పని దినాలు కల్పించాలనే లక్ష్యంతో పథకాన్ని అమలు చేస్తుండగా కేంద్ర ప్రభుత్వం నిబంధనలతో కూలీలు ఉపాధి హామీ పనులకు దూరమయ్యేటట్లు కనిపిస్తున్నది.
ఉపాధి పనుల్లో కొత్త నిబంధనలు
ఉపాధి పనుల్లో పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు అమలు చేస్తున్నది. గతంలో ఒక్కో గ్రామ పంచాయతీకి 40 పనులు ఉండేవి. ఇప్పుడు వాటిని 20పనులకు తగ్గించింది. అవి పూర్తి అయిన తర్వాత మళ్లీ పనులను గుర్తించి చేసుకోవచ్చు. గతేడాదితో పోల్చితే ఉపాధి పనుల పని దినాల సంఖ్య తగ్గింది. గతేడాది 2,71,644 పని దినాలు పూర్తి చేశాం. ఈ ఏడాది పని దినాల సంఖ్య తగ్గించగా ఇప్పటివరకు 2,37,024 పని దినాలు పూర్తి అయ్యాయి. కొత్త నిబంధన ప్రకారం కూలీలు ఉపాధి పనులను ఉదయం, సాయంత్రం చేసుకోవచ్చు. పని సమయంలో ఫొటో సేకరించి యాప్లో అప్లోడ్ చేస్తున్నాం. – విద్యాధర్రావు, ఎంపీడీవో, అశ్వారావుపేట
కొత్త నిబంధనతో నష్టపోతున్నాం..
ఉపాధి హామీ పనుల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలతో కూలీలంతా నష్టపోతున్నాం. ఉపాధి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతోంది. ప్రభుత్వం ప్రకటించిన రోజూవారీ కనీస వేతనం కూడా అందడం లేదు. పని దినాలను కుదించడమే దీనికి ప్రధాన కారణం. గతంలో ఒక్కో పంచాయతీలో 40పనుల వరకు చేసుకునే వెసులుబాటు ఉంది. ఇప్పుడు పనుల సంఖ్యను 20కి తగ్గించడంతో ఉపాధి కోల్పోతున్నాం. అంతేకాదు కొత్త నిబంధన వల్ల పనుల్లో తీవ్ర జాప్యం సైతం చోటు చేసుకుంటుంది.