వైరారూరల్, జూన్ 9 : బాసరలో పిల్లాడికి సంతోషంగా అక్షరాభ్యాసం చేయించుకున్నారు. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ.. ఆలయ సంఘటనలు నెమరువేసుకుంటూ.. బాలుడి చదువుపై చర్చించుకుంటూ ఇంటిదారి పట్టారు. ఇంతలోనే జరిగిన రోడ్డు ప్రమాదం ముగ్గురిని కనిపించని తీరాలకు తీసుకెళ్లింది. ఆ కుటుంబాన్ని శోక సంద్రంలోకి నెట్టింది. వైరా మండలం స్టేజీ పినపాక గ్రామంలో జాతీయ రహదారిపై శుక్రవారం ఎదురుగా వస్తున్న లారీని కారు ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కల్లూరు మండలం బోడిమళ్లతండాకు చెందిన అజ్మీరా రాంబాబు(50), తన కూతురు వాచ్యానాయక్తండాకు చెందిన బానోతు అంజలి(25), బానోతు శ్రీవల్లి(16 నెలలు), బాబు, రాణి, ప్రవీణ్, స్వాతి, కార్తికేయ(అక్షరాభ్యాసం చేయించుకున్న బాలుడు)తో కలిసి ఖమ్మం నుంచి రైలులో బాసర వెళ్లారు.
తిరిగి రెండు రోజుల క్రితం ఖమ్మం చేరుకుని బంధువుల ఇంట్లో ఉన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఖమ్మం నుంచి కల్లూరుకు కారులో వెళ్తూ ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్నారు. దీంతో రాంబాబు, అంజలి, శ్రీవల్లి అక్కడికక్కడే మృతిచెందారు. బాబు, రాణి, ప్రవీణ్, స్వాతి, కార్తికేయకు తీవ్ర గాయాలుకాగా.. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కారులో ఇరుక్కున్న రాంబాబు మృతదేహాన్ని తీసేందుకు పోలీసులు గ్యాస్ కట్టర్లను ఉపయోగించారు. ఘటనా స్థలానికి వైరా ఏసీపీ రెహమాన్, సీఐ తాటిపాముల సురేశ్, ఎస్సై శాఖమూరి వీరప్రసాద్, తల్లాడ ఎస్సై పి.సురేశ్ హుటాహుటిన చేరుకొని గాయపడిన వారిని 108లో ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. వైరా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వాచ్యానాయక్ తండాలో విషాదం
కల్లూరు, జూన్ 9 : పినపాక స్టేజీ జాతీయ రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం కారు-లారీ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతిచెందడంతో వారి స్వగ్రామమైన వాచ్యానాయక్ తండాలో విషాదం అలుముకుంది. రాంబాబు, అంజలి, శ్రీవల్లి మృతదేహాలను చూసి గ్రామస్తులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు.