పెనుబల్లి, జనవరి 1 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా తిరువూరులో బీఆర్ఎస్ ఫ్లెక్సీలు ఆదివారం దర్శనమిచ్చాయి. బీఆర్ఎస్ పార్టీ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ కేసీఆర్ చిత్రపటాలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ను కృష్ణా జిల్లా గొర్రెల, మేకల పెంపకందారుల మాజీ చైర్మన్ గడిపర్తి రామకృష్ణయాదవ్ మర్యాదపూర్వకంగా కలవడంతో బీఆర్ఎస్ విధివిధానాలను సీఎం ఆయనకు వివరించారు.
పార్టీ సిద్ధాంతాలు, సీఎం కేసీఆర్పై విశ్వాసంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని, త్వరలో ఆంధ్రా నుంచి పెద్దఎత్తున హైదరాబాద్లో కేసీఆర్ను కలిసి పార్టీలో చేరనున్నట్లు రామకృష్ణయాదవ్ ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆంధ్రా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.