భద్రాచలం, మే 5: ‘ప్రధాని మోదీ సాబ్ మన్ కీ బాత్ కాదు… ఆదివాసీల గోడు వినండి..’ అని ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ నేత బృందా కారత్ అన్నారు. భద్రాచలం పట్టణంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో శుక్రవారం నిర్వహించిన ‘తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం’ రాష్ట్ర మూడో మహాసభలో ఆమె మాట్లాడారు. ఆదివాసీ అనే పదం వింటేనే మోదీకి భయమన్నారు. ఆదివాసీల హక్కులను కేంద్రంలోని బీజేపీ హరిస్తున్నదన్నారు. ఆదివాసీలు వనవాసీలని ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్ నాటి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేయలేదని, వారికి లొంగిపోయిందని విమర్శించారు. నాడు ఆదివాసీలు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేశారని గుర్తుచేశారు.
అటవీ సంరక్షణ చట్టానికి బీజేపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని విమర్శించారు. ఏజన్సీ ఏరియాలో ఎలాంటి ప్రభుత్వ విధానమైనా గ్రామసభ ద్వారానే తీర్మానం చేయాల్సి ఉందని, కానీ కేంద్రం గ్రామసభలను పట్టించుకోవడం లేదన్నారు. కార్పొరేట్ శక్తులు అంబానీ, అదానీలకే ప్రాధాన్యం ఇస్తున్నదన్నారు. చదువుకున్న ఆదివాసీ యువతకు ఉద్యోగాలు ఇవ్వడం లేదన్నారు. రైల్వేతో సహా అనేక కేంద్రం పరిధిలోని పరిశ్రమల్లో లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా, వాటిని భర్తీ చేయడం లేదన్నారు.
ప్రధాని మోదీ ఇప్పటివరకు 100 సార్లు మన్ కీ బాత్ నిర్వహించారని, కార్యక్రమంలో ఒక్కసారైనా ఆదివాసీల మాటలు వినలేదన్నారు. ఛత్తీస్గఢ్లోని ఆదివాసీలపై ఇప్పటికీ దాడులు జరుగుతున్నాయన్నారు. ఆదివాసీలు క్రైస్తవంలోకి వెళితే వారిని ఎస్టీల జాబితా నుంచి తొలగిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు ఏ మతాన్ని నమ్మాలో నిర్ణయించుకునే హక్కు రాజ్యాంగం ఇచ్చిందని, కానీ రాజ్యాంగ హక్కులను నిర్వీర్యం చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. ఆదివాసీల సంస్కృతిని మనువాద హిందూత్వ సిద్ధాంతం హైజాక్ చేస్తున్నదన్నారు. ఆదివాసీల పండుగలు, జీవన విధానంపైనా దాడులు జరుగుతున్నాయన్నారు. మాజీ ఎంపీ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ ఆంధ్రాలో విలీనమైన ఐదు పంచాయతీలను తెలంగాణలో కలపాలని అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పోరాడుతున్నారని, అందుకే బీఆర్ఎస్ను సమర్ధిస్తున్నట్లు తెలిపారు. గిరిజనులు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే పోరాటాలే శరణ్యమని పేర్కొన్నారు. సభలో మాజీ ఎంపీ డాక్టర్ మిడియం బాబూరావు పాల్గొన్నారు.