ఇల్లెందు రూరల్, సెప్టెంబర్ 8: బొజ్జాయిగూడెం సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గంజాయి తరలిస్తున్న ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. ఇల్లెందు ఎక్సైజ్ సీఐ బి.రామ్ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది గ్రామంలో వాహన తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలో అటుగా వచ్చిన కారును ఆపి సోదా చేశారు. కారులో 43 కిలోల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. కారులో ప్రయాణిస్తున్న నిందితులను ఒడిశాకు చెందిన సమరేశ్ సర్కార్, ఉత్తరాఖండ్కు చెందిన సంజీత్సిక్దార్గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
నిందితులు ఒడిశాలో గంజాయి సేకరించి హైదరాబాద్కు తరలిస్తుండగా పట్టుబడ్డారని ఎక్సైజ్ సీఐ తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.9.60 లక్షలు ఉంటుందన్నారు. అలాగే కొద్దిసేపటి తర్వాత అటుగా వస్తున్న మరో ద్విచక్రవాహనాన్ని ఆపి ఎక్సైజ్ పోలీసులు సోదా చేశారు. ఈ క్రమంలో వాహనదారుడు నుంచి 5.4 కిలోల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈక్రమంలో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడి వివరాలేమీ తెలియరాలేదు. దాడుల్లో ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్ తిరుపతి, ఇన్స్పెక్టర్ కె.సర్వేశ్వర్, సబ్ ఇన్స్పెక్టర్స్ ముబాషిర్ అహ్మద్, గోవర్థన్ పాల్గొన్నారు.