గులాబీ పార్టీ జిల్లా పగ్గాలు ఎవరికి అప్పగిస్తారన్న ఊహాగానాలకు తెరపడింది. అసలు నియమిస్తారా..? లేదా అనే ఉత్కంఠకు ఫుల్స్టాప్ పడింది. టీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు యువనేతలకు బాధ్యతలను అప్పగించారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల గులాబీ సారథులను బుధవారం అధినేత సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా ఇటీవల స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి శాసనమండలి సభ్యుడి (ఎమ్మెల్సీ)గా ఎన్నికైన తాతా మధుసూదన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు నియమితులైయ్యారు. కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ప్రత్యేక కమిటీలను నియమించడంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
యువనేత ఆశీస్సులతో రేగాకు జిల్లా బాధ్యతలు
భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 26 (నమస్తే తెలంగాణ) : ఆదివాసీ, గిరిజనుల్లో పట్టున్న యువ నాయకుడు పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుకు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడి పదవి వరించింది. దీంతో జిల్ల్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబురాలు జరుపుకున్నారు. విద్యావంతుడు, యువకుడికి గులాబీ పార్టీ జిల్లా బాధ్యతలు అప్పగించడంతో జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతం కానున్నదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. పినపాక నియోజకవర్గంలో కమ్యూనిస్టుల కంచుకోటను బద్దలుకొట్టి విజయం సాధించిన రేగా కాంతారావు సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్లో చేరారు. అనతి కాలంలోనే ఆయన ప్రభుత్వ విప్ పదవిని దక్కించుకున్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. టీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై, తన నియోజకవర్గ అభివృద్ధి కోసం టీఆర్ఎస్లో చేరారు.
పోడు సమస్యలపై పోరాటం..
ఆదివాసీ జిల్లాలో ఎక్కువ మంది గిరిజనులు పోడు సాగు చేసుకుంటారు. వారి భూములకు పట్టాలు ఇవ్వకపోవడంతో అటవీశాఖ అధికారులపై తిరుగుబాటు చేశారు. గిరిజనులకు పట్టాలు ఇవ్వాలని సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యకు పరిష్కారానికి ముఖ్యమంత్రి చొరవ చూపడంతో రేగా కాంతారావు కృషి ఫలించినైట్లెంది.
ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఎన్నికైన తాతా మధుసూదన్ గత డిసెంబర్లో జరిగిన ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికల్లో విజయం సాధించారు. ఇప్పటికే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు బూత్ కమిటీలు, జిల్లా కమిటీలు, పార్టీ అనుబంధ కమిటీలు, పట్టణ, నగర కమిటీలను ఏర్పాటు చేశారు. తాజాగా జిల్లాలకు పార్టీ కమిటీలను ఏర్పాటు చేయడంతో రానున్న శాసనసభ ఎన్నికలకు పార్టీశ్రేణులను సన్నద్ధం చేసేందుకు కార్యాచరణ ప్రారంభించినట్లు పార్టీవర్గాలు భావిస్తున్నాయి. 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పార్టీ జిల్లా అధ్యక్షుడిగా బుడాన్ బేగ్ వ్యవహరించారు. ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ఆస్థానం ఖాళీ అయిన భర్తీ చేయలేదు. పార్టీ కార్యకలాపాలు కొనసాగేందుకు ఖమ్మం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ఇన్చార్జిగా సీనియర్ నాయకులు గుండాల కృష్ణను నియమించారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయాలని అధిష్ఠానం నిర్ణయించడంతో జిల్లాల వారీగా కమిటీలు ఏర్పాటు చేశారు. తాతా మధుసూదన్ 2014లో టీఆర్ఎస్ పార్టీలో చేరగా 2017లో పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైయ్యారు. రాష్ట్రంలో జరిగిన పలు ఎన్నికలకు ఆయన పార్టీ పరిశీలకులుగా, సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వర్తించారు.
ఇదీ నేపథ్యం
తాతా మధుసూదన్ది మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని పిండిప్రోలు స్వగ్రామం. ప్రాథమిక విద్యాభాస్యం జడ్పీఎస్ఎస్, పిండిప్రోలు, ఇంటర్మీడియట్ ఖమ్మం, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, లా గ్రాడ్యుయేషన్ ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి చేశారు. వామపక్ష కుటుంబంలో జన్మించి ఆయన విద్యార్థి దశ నుంచే అనేక పోరాటాలకు నాయకత్వం వహించారు. 1986 – 1996 వరకు సీపీఎంలో పూర్తికాలం పని చేశారు. 1998 – 2014 మధ్యకాలంలో అమెరికాలోని తెలుగు సంఘాలైనా అట్లాంటా తెలుగు సంఘం తానాకు అధ్యక్షుడిగా, ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానాకు కార్యదర్శిగా వ్యవహరించారు. ఈ క్రమంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్ గారి పిలుపుమేరకు అమెరికాలో అనేక కార్యక్రమాలు నిర్వహించారు. 2014లో టీఆర్ఎస్లో చేరారు. 2017 నుంచి నేటి వరకు టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. పలు ఎన్నికల్లో పార్టీ విజయాల్లో కీలక భూమిక పోషించారు. ఇటీవల ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి శాసన మండలికి ఎన్నికయ్యారు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని, అందుబాటులో ఉండడంతోపాటు అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తానని తాతా మధుసూదన్ ‘నమస్తే తెలంగాణ ప్రతినిధి’కి తెలిపారు.