నల్లగొండ ప్రతినిధి, మే28(నమస్తే తెలంగాణ) : పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ సోమవారం సాయంత్రం ముగిసిన తర్వాత అన్ని జిల్లాల నుంచి బ్యాలెట్ బాక్సులను భారీ భద్రత మధ్య నల్లగొండ సమీపంలోని అనిశెట్టి దుప్పలపల్లి గోదాముల్లోని స్ట్రాంగ్ రూమ్స్కు తరలించినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ దాసరి హరిచందన తెలిపారు. పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగిసినా అప్పటికే పోలింగ్ కేంద్రాల్లో ఉన్న ఓటర్లంతా ఓటు వేయడానికి కొన్నిచోట్ల సాయంత్రం ఏడు గంటల వరకు కొనసాగిందన్నారు. పోలింగ్ ఎక్కడా ఎలాంటి అంతరాయం లేకుండా శాంతియుత వాతావరణంలో జరిగిందని పేర్కొన్నారు. పోలింగ్ ప్రక్రియలో మొత్తం 12 జిల్లాల జిల్లా కలెక్టర్లు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరించిన అడిషనల్ కలెక్టర్లు, పోలీస్ అధికారులు, జిల్లా స్థాయి అధికారులు, ఎమ్మెల్సీ ఎన్నికల అధికారుల పర్యవేక్షణలో ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించగలిగామని చెప్పారు. పోలింగ్ సందర్భంగా ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరుగలేదన్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారితోపాటు ఆర్ఓలు పోలింగ్ ప్రక్రియను వెబ్ కాస్టింగ్లో నిరంతరం పర్యవేక్షించారని తెలిపారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన అభ్యర్థులు, రాజకీయ పార్టీలు, ఓటర్లు, జిల్లాల ఎన్నికల అధికారులు, పోలీసు, రెవెన్యూ అధికారులు, 12 జిల్లాల సిబ్బందికి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
బ్యాలెట్ బాక్సులను అనిశెట్టి దుప్పలపల్లి గోదాములో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లలో భద్రపర్చగా కలెక్టర్, ఎన్నికల అధికారి దాసరి చందన, జిల్లా ఎస్పీ చందనాదీప్తి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు రాహుల్ బొజ్జ సమక్షంలో సీల్ వేశారు. వారితోపాటు రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులు, వారి ఏజెంట్లు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, డీఎఫ్ఓ రాజశేఖర్, డీఆర్డీఓ నాగిరెడ్డి, డీపీఓ మురళి, పీఆర్ ఈఈ భూమన్న, ఎస్బీ డీఎస్పీ పి.రమేశ్, బీజేపీ నుంచి ఎలక్షన్ ఏజెంట్ నాగం వర్షిత్రెడ్డి, తీన్మార్ మల్లన్న ఏజెంట్ కాళీ, అభ్యర్థి రవి, బీఆర్ఎస్ నుంచి అధికారిక ఏజెంట్ తదితరులు పాల్గొన్నారు.