‘ముక్కుమీద కోపం నీ ముఖానికే అందం.. నా బుంగమూతి చందం నీ ముందరి కాళ్ల బంధం..’ అంటూ అప్పటి కుర్రకారును ఉర్రూతలూగించారు.. ‘మీర జాలగలడా నా యానతి.. ప్రతి విధాన మహిమన్..’ అంటూ ఆబాలగోపాలాన్ని మెప్పించారు.. ‘పగలే వెన్నెల జగమే ఊయల.. కదలే ఊహలకే కన్నులంటే..’ అంటూ వెండితెరను సమ్మోహనపరపరిచారు.. ఆమే తెలుగింటి సత్యభామ జమున. వందలాది చిత్రాల్లో కథానాయికగా నటించి ధ్రువతారగా వెలిగారు. గురువారం రాత్రి ఆమె హైదరాబాద్లోని స్వగృహంలో అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు.
ఆమె మరణంతో సినీ ప్రేమికులు, అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆమెతో ఉన్న అనుబంధాన్ని ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలానికి చెందిన చెక్కిలాల మోహన్రావు (జడ్పీటీసీ), గోపిశెట్టి రంగారావు (విశ్రాంత ఉపాధ్యాయుడు) ‘నమస్తే’తో పంచుకున్నారు. 1999లో ఓ రాజకీయ పర్యటనకు పెనుబల్లికి వచ్చిన సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఓ పార్టీ తరఫున ప్రచారం చేశారని, నాటి ప్రచారంలో ఆమె సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్గా నిలిచారని నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఆమె మృతికి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
-పెనుబల్లి, జనవరి 27