సత్తుపల్లి, సెప్టెంబర్ 1: ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో ఇప్పటికే వృద్ధాప్య పింఛన్ రూ.600 మాత్రమే ఇస్తున్నారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గుర్తుచేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో పేదల సంక్షేమానికి పాటుపడుతున్న సీఎం కేసీఆర్ మన దగ్గర రూ.2016, రూ.3016 చొప్పున పింఛన్లు ఇస్తున్నారని అన్నారు. అందుకే తెలంగాణ రాష్ట్రం సంక్షేమంలో దేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు.
ప్రజల మనసు తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ అని, అందుకే వారి కష్టసుఖాల్లో భాగమవువుతూ వారి అభివృద్ధి, సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. వృద్ధాప్య, వితంతు, వికలాంగ, ఒంటరి మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా పింఛన్లు మంజూరు చేయగా.. ఎమ్మెల్యే సండ్ర గురువారం ఆయా పింఛన్ల కార్డులను సత్తుపల్లి మున్సిపాలిటీలోని 5, 6, 7, 18, 19, 20, 21, 22, 23 వార్డుల్లో లబ్ధిదారులను కలుసుకొని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా ఆసరా పింఛన్లను అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని స్పష్టం చేశారు. ఒంటరి మహిళలు, బీడీ, గీత కార్మికులకు, బోధకాల బాధితులకు సామాజిక పింఛన్లు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని గుర్తుచేశారు. మనకంటే పెద్ద రాష్ర్టాలైన గుజరాత్లో 12.5 లక్షలు, మహారాష్ట్రలో 31. 5లక్షల మందికి మాత్రమే పింఛన్లు అందిస్తుండగా.. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 48 లక్షల మందికి పింఛన్లు అందుతున్నాయని వివరించారు.
సత్తుపల్లి అభివృద్ధిని చూడండి..
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సత్తుపల్లిలో జరిగిన అభివృద్ధిని ప్రజలు గమనించాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కోరారు. 1974లో సత్తుపల్లిలో నిర్మించిన ప్రభుత్వాస్పత్రి శిథిలావస్థకు చేరితే దానికి సీఎం కేసీఆర్ రూ.35 కోట్లు కేటాయించి దానిని 100 బెడ్ల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసి నిర్మిస్తున్నారని అన్నారు. రూ.4 కోట్లతో ఇప్పటికే మున్సిపల్ కార్యాలయాన్ని సుందరంగా నిర్మించామన్నారు. ఇంకా అనేక అభివృద్ధి పనులు చేపట్టామని వివరించారు. అనంతరం లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. తరువాత ఆసరా పింఛన్ లబ్ధిదారులతో కలిసి ఎమ్మెల్యే సండ్ర సహపంక్తి భోజనం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాసరావు, సుజాత, కొత్తూరు ఉమమహేశ్వరరావు, కూసంపూడి మహేశ్, గాదె సత్యనారాయణ, నరుకుళ్ల మమత, గ్రాండ్ మౌలాలీ, తోట సుజలారాణి, మందపాటి పద్మజ్యోతి, అమరవరపు విజయనిర్మల, చాంద్ పాషా, అద్దంకి అనిల్, మహ్మద్ హనీఫా, మట్టా ప్రసాద్, రఫీ, అంకంరాజు, హరికృష్ణారెడ్డి, దేవరపల్లి ప్రవీణ్, వల్లభనేని పవన్ తదితరులు పాల్గొన్నారు.