సత్తుపల్లి టౌన్, ఫిబ్రవరి 26 : విద్యుత్ సరఫరా విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు నామా నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం సత్తుపల్లి పట్టణంలోని పలు వార్డుల్లో బీఎంఎఫ్టీ, టీయూఎఫ్ఐడీసీ నిధుల నుంచి రూ.35 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించతలపెట్టిన కమ్యూనిటీ హాల్స్, సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, డ్రైన్లకు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా 15వ వార్డులో మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపీ మాట్లాడారు. ఒకప్పుడు వేసవికాలం వచ్చిందంటే పట్టణాల్లో షాపుల ముందు జనరేటర్ల మోత హోరెత్తేదని, జనరేటర్లు లేని దుకాణాలు అంధకారంలో ఉండేవని చెప్పారు. నేడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడా విద్యుత్ అంతరాయం లేకుండా సీఎం కేసీఆర్ చేశారని ప్రశంసించారు. పక్క రాష్ర్టాలు సమస్యలతో సతమతమవుతుంటే తెలంగాణ మాత్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందాలని కుట్రలు పన్నుతున్నదని ఆరోపించారు. ప్రజల మనిషిగా పేరొందిన ఎమ్మెల్యే సండ్ర ఈ మూడేళ్ల కాలంలో రూ.100 కోట్ల నిధులు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని, అలాంటి నాయకుడిని, సీఎం కేసీఆర్ను ఆశీర్వదించాలన్నారు.
అన్నివర్గాల ప్రజలకు బాసటగా ఉండేవిధంగా రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాధీముబారక్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఆసరా పింఛన్లు, కేసీఆర్ కిట్, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు, కంటివెలుగు వంటి పథకాలను రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలుచేస్తున్నారని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు తెలంగాణలో ఏమి అభివృద్ధి జరిగిందని అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. విమర్శలు చేసేవారు కంటి పరీక్షలు చేయించుకుంటే అభివృద్ధి కనబడుతుందని ఎద్దేవా చేశారు.
రాజకీయ లబ్ధి కోసం విమర్శిస్తున్నారు
ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
మొన్నటివరకు సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను ప్రశంసించిన కొందరు నాయకులు వారి రాజకీయ లబ్ధి కోసం నేడు విమర్శించడాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సత్తుపల్లి నియోజకవర్గానికి తాను మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు సహకారంతో రూ.100 కోట్ల నిధులను ఇప్పటికే ఖర్చు చేశామని చెప్పారు. మరో రూ.60 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించనున్నట్లు వివరించారు. వేంసూరు రోడ్డులోని అర్బన్పార్కు వరకు డివైడర్ నిర్మించి సెంట్రల్ లైటింగ్, ప్రత్యేక ఫుట్పాత్ను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యేకు అన్నివార్డుల్లో ప్రజాప్రతినిధులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. అనంతరం 13వ వార్డుకు చెందిన దారావత్ సాయి కుటుంబానికి రూ.2 లక్షల బీఆర్ఎస్ బీమా చెక్కును వారు అందజేశారు. 15వ వార్డులో ఆర్వో ప్లాంట్ను నామా ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. 4వ వార్డు కౌన్సిలర్ మట్టా ప్రసాద్ తన తండ్రి రంగారావు పేరుమీద ఆర్వో వాటర్ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలపడంతో వార్డు కౌన్సిలర్ను అభినందించారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఆత్మ చైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, కమిషనర్ దొడ్డా హైమావతి, కౌన్సిలర్లు మట్టా ప్రసాద్, వీరపనేని రాధిక, అద్దంకి అనిల్, షేక్ చాంద్పాషా, సత్తుపల్లి పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు రఫీ, అంకమరాజు, బీఆర్ఎస్ నాయకులు దొడ్డా శంకర్రావు, చల్లగుళ్ల కృష్ణయ్య, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.