ఖమ్మం సిటీ, జనవరి 28: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమల్లోకి తీసుకొచ్చిన కంటి వెలుగు కార్యక్రమం లక్ష్యాలను చేరుకోవాలని డీఎంహెచ్వో డాక్టర్ బీ మాలతి అధికారులను ఆదేశించారు. జిల్లాలో వారం రోజులపాటు కొనసాగిన కంటి వెలుగు ప్రక్రియపై ఆఫ్తోమెట్రిస్టులు, వైద్యాధికారులు, క్వాలిటీ కంట్రోల్ అధికారులతో జడ్పీ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. కొన్ని సెంటర్లు అద్భుతంగా పనిచేస్తున్నాయని, మరికొన్ని సెంటర్లు వెనుకబడి ఉన్నాయని అన్నారు. దానికి తగిన కారణాలను విశ్లేషించి పకడ్బందీ కార్యాచరణ రూపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
అదేవిధంగా వారం రోజుల వ్యవధిలో కంటి వెలుగు వైద్య శిబిరాల్లో తలెత్తిన స్థానిక, సాంకేతిక సమస్యల గురించి ఆరా తీశారు. వాటిని పునరావృతం జరుగకుండా జాగ్రత్తలు పాటించాల్సిన బాధ్యత ఇన్చార్జులదేనని అన్నారు. కండ్ల సమస్యల తీవ్రత ఆధారంగా చుక్కల మందులు, కళ్లద్దాలు తక్షణమే అందజేయాలని సూచించారు. డిఫ్యూటీ డీఎంహెచ్వో, కంటి వెలుగు ప్రొగ్రాం అధికారి డాక్టర్ రాంబాబు, క్వాలిటీ కంట్రోల్ అధికారి శ్రీధర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.