తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నది. ‘రైతుబంధు’తో కర్షకుల పెట్టుబడి కష్టాలు తీర్చింది. రాయితీపై వ్యవసాయ పనిముట్లు, పరికరాలు అందజేస్తున్నది. బ్యాంకుల ద్వారా రుణాలు ఇస్తున్నది. ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చర్యలు చేపడుతున్నది. అంతేకాదు, రైతులు పండించిన పంటకు కనీస మద్దత ధర కల్పించేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలుకు రంగం సిద్ధం చేసింది. జిల్లావ్యాప్తంగా ధాన్యం కొనుగోలుకు 234 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నది. ఈ సారి 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేలా నిర్ణయం తీసుకున్నది. కాగా, గురువారం కల్లూరు మండలం పుల్లయ్యబంజర, కనుమతండాలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
– ఖమ్మం, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఖమ్మం జిల్లాలో ఈ వారంలో ధాన్యం వస్తుందని అధికారులు భావిస్తున్నారు. గురువారం కల్లూరు మండలం పుల్లయ్యబంజర, కనుమతండాలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రైతుల చెంతనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేలా కలెక్టర్ వీపీ గౌతమ్ అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేయడంతో ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెనువెంటనే రైస్ మిల్లులకు కస్టమ్ మిల్లింగ్ కోసం తరలించనున్నారు. రైస్ మిల్లులో కస్టమ్ మిల్లింగ్ చేయిస్తే నూకల శాతం అధికంగా ఉంటుంది. కొనుగోలు కేంద్రాల్లో ఒక లారీకి సరిపడా ధాన్యం బస్తాల తూకం పూర్తయిన వెంటనే కస్టమ్ మిల్లింగ్ కోసం తరలిస్తారు. ఈ వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపర్చడం ద్వారా ధాన్యం విక్రయించిన రైతులకు సకాలంలో వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి. వారంరోజుల లోపే డబ్బులు రైతులకు అందనున్నాయి. గత పాలకుల హయాంలో నెలరోజులైనా డబ్బులు చేతికి అందేవి కావు. చెక్కులు ఇచ్చినా వారం, పది రోజుల వరకు డబ్బులు ఇవ్వకపోయేది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగైదు రోజుల వ్యవధిలోనే రైతులకు డబ్బులు జమచేస్తున్నది.
గతంలో మార్కెట్లో వ్యాపారులదే రాజ్యం. వారంతా సిండికేట్గా మారి నిర్ణయించిన ధరకే రైతులు ధాన్యం విక్రయిం చాల్సిన పరిస్థితి. రైతులు మార్కెట్కు తీసుకొచ్చిన ధాన్యాన్ని తిరిగి తీసుకెళ్లే అవకాశం లేకపోవడంతో వ్యాపారి చెప్పిన ధరకు ధాన్యం విక్రయించి నష్టపోయేవారు. కానీ, సీఎం కేసీఆర్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో అన్నదాతలకు మేలు జరుగుతున్నది. సర్కారు నిబంధనలకు లోబడి ఉన్న ధాన్యాన్ని ‘ఏ’ గ్రేడ్కు క్వింటాల్కు రూ.2,060, సాధారణ రకానికి క్వింటాల్కు రూ.2,040 నిర్ణయించారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే ధాన్యం రకాన్ని బట్టి ధర లభిస్తుంది. దీంతో దళారుల బెడద, వ్యాపారుల మోసానికి చెక్ పడిందని చెప్పవచ్చు.
జిల్లాలో యాసంగిలో ధాన్యాన్ని కొనుగోలుకు అధికారులు 234 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో డీఆర్డీఏ ఐకేపీ 53, పీఏసీఎస్ 148, డీసీఎంఎస్ 29, మార్కెట్ కమిటీ 4 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కోటి గన్నీ బ్యాగులు అవసరం ఉండగా.. ప్రస్తుతం 54 లక్షల బ్యాగులు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో ఒకసారి వినియోగించినవి 6 లక్షలున్నాయి. ఇవి కాకుండా ఇంకా 40 లక్షల బ్యాగులు అవసరం ఉంది. కేంద్రాల్లో తాగునీటి వసతి, కరెంట్, టార్ఫాలిను కవర్లు, ప్యాడీ క్లీనర్లు, వేయింగ్ స్కేల్స్, మాశ్చరైజ్ మీటర్లు తదితర వాటిని ముందస్తుగానే ఏర్పాటు చేయనున్నారు. మహిళలకు తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నారు. కాగా ప్రభుత్వం వరి ధాన్యం గ్రేడ్-ఏ రకం క్వింటాకు రూ.2,060 సాధారణ రకానికి రూ.2,040 మద్దతు ధర అందిస్తుంది.
రైతులు పండించిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. వరి కోతలు ప్రారంభమైన పుల్లయ్యబంజర, అనుమతండాలో ఇప్పటికే కొనుగోళ్లు ప్రారంభించాం. వరి కోతలు ఎక్కడ పూర్తయితే అక్కడ కేంద్రాలు ప్రారంభించేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. కేంద్రాల్లో కనీస వసతులు ఏర్పాటు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నాం. ఈ సీజన్లో 4 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోళ్లు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
– మధుసూదన్రావు, జిల్లా అదనపు కలెక్టర్