అశ్వారావుపేట, ఫిబ్రవరి 23: నియోజకవర్గ అభివృద్ధి ప్రోగ్రామ్ (సీడీపీ) నిధులు భద్రాద్రి జిల్లాకు వచ్చేశాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్యులు జారీ చేసింది. ఒక్కో నియోజకవర్గానికి రెండో విడత కింద రూ.1.50 కోట్లు మంజూరు చేసింది. జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు కలిపి రూ.7.50 కోట్లు కేటాయించింది. ఇప్పటికే గత ఏడాది జూలైలో మొదటి విడత నిధులను విడుదల చేసిన ప్రభుత్వం.. నియోజకవర్గాల అభివృద్ధికి తోడ్పాటుగా నిలుస్తోంది. పల్లెలు, పట్టణాల అభివృద్ధే ధ్యేయంగా తెలంగాణ సర్కారు నిధులు విడుదల చేస్తుండడంతో ఏజెన్సీ జిల్లా భద్రాద్రి కొత్తగూడెంలో ప్రగతి పరుగులు తీస్తోంది. గత ఏడాది సీడీపీ నిధులు రూ.3 కోట్లే ఉండగా సీఎం కేసీఆర్ ఆ కోటాను రూ.5 కోట్లకు పెంచారు. మరోవైపు ఎమ్మెల్సీల కోటాలో పల్లా రాజేశ్వర్రెడ్డి (పట్టభద్రులు), తాతా మధుసూదన్ (స్థానిక సంస్థలు), లక్ష్మారెడ్డి (ఉపాధ్యాయుల)లకు ఒక్కొక్కరికీ రూ.1.50 కోట్ల చెప్పున నిధులు విడుదలయ్యాయి. ఈ నిధులతో నియోజకవర్గాల్లో మరింత అభివృద్ధి జరుగుతుందని అధికారులు చెబుతున్నారు.
అభివృద్ధి, సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోంది. అభివృద్ధికి అవసరమయ్యే నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ ప్రజాప్రతినిధులు, ప్రజలకు చేయూతనిస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు పంచాయతీరాజ్, ఆర్అండ్బీ ద్వారా ప్రత్యేక నిధులు విడుదల చేసిన ప్రభుత్వం.. తాజాగా 2022-23 సంవత్సరానికి గాను ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు నియోజకవర్గ అభివృద్ధి ప్రోగ్రాం నిధులను మంజూరు చేస్తూ (ప్రొసీడింగ్ నెంబర్: 691/డీవైఎస్వో/సీడీపీ/ఎంఎల్ఏ/ఏఎస్పీటీ/ 2022, తేదీ.21-01-2023 ద్వారా) ఉత్తర్యులు జారీ చేసింది. ఇందులో భాగంగా గత ఏడాది జూలైలో 2021-22 సంవత్సరానికి ప్రభుత్వం సీడీపీ మొదట విడత నిధులను విడుదల చేసింది. తాజాగా రెండో విడత కింద నియోజకవర్గానికి రూ.1.50 కోట్లు చొప్పున జిల్లాలోని అశ్వారావుపేట, కొత్తగూడెం, భద్రాచలం, పినపాక, ఇల్లెందు నియోజకవర్గాలకు గాను మొత్తం రూ.7.50 కోట్లను రిలీజ్ చేసింది. 2020-2 సంవత్సరలో రూ.3 కోట్లుగానే ఉన్న సీడీపీ నిధులను సీఎం కేసీఆర్ ఏకంగా రూ.5 కోట్లకు పెంచారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమానికి ఈ నిధులు ఎంతగానో ఉపయోగకరంగా ఉన్నాయి. ఎమ్మెల్యే కోటాలో ‘మన ఊరు – మన బడి’కి రూ.2 కోట్లు వెచ్చించాలని గత ఏడాది ఎమ్మెల్యేలు నిర్ణయించారు. మొదటి విడత నిధులు పూర్తి స్థాయిలో అభివృద్ధికి వినియోగించిన ఎమ్మెల్యేకు ప్రభుత్వం రెండో విడత నిధులను గత నెల 21 మంజూరు చేసింది. ఈ నిధుల నుంచి జనరల్, ఎస్టీ, ఎస్సీ జనాభా ప్రాతిపదికన ఖర్చు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, తాతా మధుసూధన్, లక్ష్మారెడ్డిలకు సైతం ఒక్కొక్కరికి రూ.1.50 కోట్ల చొప్పున రూ.4.50 కోట్లు జిల్లా ఖాతాలో జమ అయ్యాయి. వీరు మాత్రం ఏదైనా జిల్లాను ఎంచుకుని నిధులను ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నియోజవర్గాల పర్యటనలో భాగంగా ప్రజల నుంచి వచ్చిన సమస్యలపై ఇచ్చిన హమీల పరిష్కారానికి ఈ నిధులు వెచ్చించవచ్చు. గ్రామాల్లో తాగు
నీటి సమస్య, ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణాలు, మరుగుదొడ్లు, సీసీ రోడ్లు, విద్యుత్ సమస్యలు, వీధి దీపాలు, కాలువల నిర్మాణాలు, కమ్యూనిటీ హాళ్లు వంటి 98 రకాల అభివృద్ధి పనులకు ఉపయోగించుకోవచ్చు. సీడీపీ నిధుల వినియోగంపై గతంలో జిల్లా కలెక్టర్ అనుమతి తీసుకోవాల్సి ఉండగా ఈ ఏడాది నుంచి కలెక్టర్తోపాటు జిల్లా మంత్రి ఆమోదం కూడా పొందాల్సి ఉంటుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీడీపీ కింద చేపట్టే అభివృద్ధి పనుల రికార్డులు, ఫైళ్లు జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి నుంచి కలెక్టర్ ఆమోదానికి, అక్కడి నుంచి జిల్లా మంత్రి ఆమోదానికి వెళ్తాయి. జనాభా ప్రాతిపదికన మంజూరయ్యే సీడీపీ నిధుల్లో ఎస్స్టీ, ఎస్సీ రిజర్వేషన్ నిధులను ఆయా ప్రాంతాల్లోనే ఖర్చు చేయాల్సి ఉండగా జనరల్ కోటా నిధులు ఏ ప్రాంతంలోనైనా వినియోగించుకోవచ్చని ప్రభుత్వ మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి.
నియోజకవర్గ అభివృద్ధికి సీడీపీ నిధులు ఎంతగానో దోహదపడతాయి. 2020-21 వరకు సీడీపీ నిధులు కేవలం రూ.3 కోట్టే ఉండేవి. అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేసేందుకు సీఎం కేసీఆర్ ఆ నిధులను ఏకంగా రూ.5 కోట్లకు పెంచారు. నిర్ణీత గడువులోగా సీడీపీ నిధులను విడుదల చేస్తున్న సీఎం కేసీఆర్కు నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సీడీపీ నిధులను నిర్దేశించిన కేటగిరీల వారీగా ఖర్చు చేస్తాం. అభివృద్ధి పనులకుఅవసరమైన నిధులను మంజూరు చేస్తూ అశ్వారావుపేట నియోజకవర్గ అభివృద్ధిని సీఎం కేసీఆర్ ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు.
-మెచ్చా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే, అశ్వారావుపేట