తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. పంట వేసింది మొదలు విక్రయించే వరకు తోడుగా ఉంటున్నది. పంట పెట్టుబడి సాయంతో వడ్డీ వ్యాపారుల నుంచి విముక్తి కల్పించింది. ఎరువులు విత్తనాల కోసం ఇబ్బందులు పడకుండా వాటిని అందుబాటులోకి తీసుకొచ్చింది. పండించిన పంట దళారులకు విక్రయించి మోసపోకుండా మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నది. అంతేకాదు, పంట ఉత్పత్తులు నిల్వ చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం గోదాముల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రఘునాథపాలెం మండల కేంద్రం జింకలతండా రోడ్డులో 20 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల మూడు గోదాములు నిర్మించింది. తెలంగాణ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ రూ.14.90 కోట్లతో గోదాములను నిర్మించి అందుబాటులోకి తీసుకొచ్చింది. శుక్రవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఈ గోదాములను ప్రారంభించనున్నారు. దీంతో కర్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతుబాంధవుడు సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని ముక్తకంఠంతో పేర్కొంటున్నారు.
ఖమ్మం, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రైతులు పండించిన పంటలకు భరోసా లభించింది. చేతికొచ్చిన పంటను దాచుకునేందుకు దిగాలు చెందాల్సిన అవసరమే లేదు. నయా పైసా ఖర్చు లేకుండా గోదాముల్లో భద్ర పర్చుకునే వీలు కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా గోదాములను నిర్మించి అన్నదాతలకు అందుబాటులోకి తెచ్చింది. పండించిన పంటలను నిల్వ చేసుకునే సౌకర్యాన్ని కర్షకుల ముంగిటకు తెచ్చింది. ఏదైనా పంటకు మార్కెట్లో ధర లేకుంటే దిగాలు పడాల్సిన అవసరమే లేకుండా భరోసా కల్పిస్తోంది.
గిట్టుబాటు ధర వచ్చే వరకు ఆ పంటను గోదాముల్లో దాచి పెట్టుకునే చక్కటి వెసులుబాటును కల్పించింది. గిట్టుబాటు ధర వచ్చినప్పుడు గోదాములోని ఆ పంటను తీసుకెళ్లి అమ్ముకోవచ్చు. రైతన్నల శ్రేయస్సు దృష్ట్యా ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున గోదాముల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా రఘునాథపాలెం మండల కేంద్రం జింకలతండా రోడ్డులో 20 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల మూడు గోదాములు నిర్మించారు. రూ.14.90 కోట్ల వ్యయంతో తెలంగాణ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ వీటి నిర్మాణ పనులను పూర్తి చేసింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై శుక్రవారం ఈ గోదాములను ప్రారంభించి అన్నదాతలకు అంకితం చేయనున్నారు. పండించిన పంటలను గిట్టుబాటు ధర లేకుంటే అన్నదాతలు ఆ ధాన్యాన్ని దాచుకోలేని దుస్థితి గత పాలకుల హయాంలో దాపురించేది.
గత్యంతరం లేక అప్పుడున్న ధరకే అమ్ముకోవాల్సిన పరిస్థితి దాపురించేది. గిట్టుబాటు ధర వచ్చినప్పుడు అమ్ముకుందామంటే ప్రకృతి విపత్తులు ఎటువైపు నుంచి పొంచి ఉంటాయోనన్న భయాందోళన ఉండేది. ప్రైవేటు గోదాముల్లో దాచుకుందామంటే అద్దెలు కట్టలేని దీనస్థితి. ఫలితంగా పంట చేతికందంగానే మార్కెట్లో దళారి చెప్పిన తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వచ్చేది. ఇలా ఏటా పండించిన పంటలను అమ్ముకునే సమయంలో రైతులు పడుతున్న ఇబ్బందులను ఉమ్మడి రాష్ట్రంలో ఏ పాలకులూ పట్టించుకోలేదు. ఫలితంగా పెట్టుబడి సరిగ్గా రాక.. చేసిన అప్పులు తీర్చలేక.. వడ్డీలను చెల్లించలేక.. అన్నదాతలు ఆత్మహత్యలే పరిష్కారంగా ఆలోచనలు చేసేవారు.
ప్రత్యేక రాష్ట్రంలో కర్షకుల కష్టాలు తెలిసిన నేత అయిన సీఎం కేసీఆర్.. ఏటా రైతులు ఇలాంటి ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. గిట్టుబాటు ధర లేకుంటే పంట నిల్వలను రైతులు దాచుకునేలా ఆలోచన చేశారు. అందుకు అవసరమైన గోదాములను ప్రతి మండలంలో నిర్మించాలని తలచి కార్యాచరణ మొదలుపెట్టారు.
రైతును రాజు చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగలా చేశారు. రైతులకు అవసరమైన అన్ని వసతులనూ కల్పించారు. దీంతో పంటల సాగు విస్తీర్ణంతోపాటు దిగుబడులూ పెరుగుతున్నాయి. విత్తనాలు, ఎరువుల కొరత లేదు. వర్షాలు, భూగర్భజలాలు పుష్కలం. ఫలితంగా దిగుబడులు గణనీయంగా పెరిగాయి. ఇప్పుడు ఆ దిగుబడులను నిల్వ చేయడానికీ గోదాములను అందుబాటులోకి తెచ్చారు. దీంతో గిట్టుబాటు ధర వచ్చే వరకూ అన్నదాతలు తమ పంటలను ఆయా గోదాముల్లో భద్రపర్చుకోవచ్చు.
ఖమ్మం నగరానికి ఆనుకొని ఉన్న రఘునాథపాలెం మండల కేంద్రంలోని ఐదెకరాల ప్రభుత్వ భూమిలో తెలంగాణ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా గోదాముల నిర్మాణాన్ని పూర్తి చేశారు. మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ప్రత్యేక దృష్టి సారించి రూ.14.90 కోట్ల నిధులు మంజూరు చేయించారు. ఏడాదిన్నర క్రితం పనులకు శంకుస్థాపన చేశారు. శరవేగంగా సాగిన నిర్మాణ పనులు ప్రస్తుతం పూర్తయ్యాయి. మొత్తం మూడు గోదాములను 20 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నిర్మించారు. రెండు గోదాములు 7,500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగినవి కాగా.. మరో గోదాము 5 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగినది. గోదాములు అందుబాటులోకి రానుండడంతో అన్నదాతలు మురిసిపోతున్నారు. పండించిన పంటలకు భరోసా కలిగిస్తున్న తెలంగాణ సర్కారుకు జేజేలు పలుకుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ద్వారా రాష్ట్రంలోనే మొట్ట మొదటగా ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో గోదాములు నిర్మాణం పూర్తి చేశాం. సుమారు రూ.15 కోట్ల వ్యయంతో 20 వేల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం కలిగిన మూడు గోదాములను నిర్మించాం. ఈ గోదాములను అన్నదాతలకు అందుబాటులోకి తెస్తున్నందుకు సంతోషంగా ఉంది. జిల్లాలోని రైతులు తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధర వచ్చే వరకు వాటిని ఇక్కడ ఉచితంగా నిల్వ చేసుకోవచ్చు.
-పువ్వాడ అజయ్కుమార్, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి