పాల్వంచ రూరల్, నవంబర్ 1 : అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరిని రూరల్ పోలీసులు అరెస్టు చేసి రూ.33లక్షల విలువగల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం… సోములగూడెం క్రాస్రోడ్డు వద్ద మంగళవారం సిబ్బందితో కాపుకాసి వాహనాన్ని అదపులోకి తీసుకొని తనిఖీ చేయగా.. అందులో 168 కిలోల ఎండు గంజాయి బయటపడింది.
వాహనంతో పాటు నిందితులను పోలీస్స్టేషన్ తరలించి విచారించగా ఖమ్మం వికలాంగుల కాలనీకి చెందిన తెల్లబోయిన ఉమేశ్, రెబ్బవరానికి చెందిన షేక్ అస్లాం, మరో మైనర్తో కలిసి మోతుగూడెం నుంచి వైరాకు రవాణా చేస్తున్నట్టు వెల్లడైంది. ఇటీవల పరిచయమైన హరి, సందీప్లను వెంటబెట్టుకుని మోతుగూడెంలో గంజాయి కొనుగోలు చేసి డాట్సన్ వాహనంలో రవాణా చేస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు. ఉమేశ్, అస్లాంలను ఆరెస్టు చేసి మైనర్ బాలుడిని ఖమ్మం జూవైనల్ హోంకు తరలించారు. మరో ఇద్దరు నిందితులు హరి, సందీప్లు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ దాడిలో సీఐ నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు.