కల్లూరు, ఫిబ్రవరి 27: తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్మోడల్గా నిలిచిందని బీఆర్ఎస్ లోక్సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఇలాంటి అభివృద్ధి బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడా లేదని స్పష్టం చేశారు. మండలంలోని కప్పలబంధం, బత్తులపల్లి, గోకవరం, పుల్లయ్యబంజరు, తూర్పు లోకవరం, పడమటి లోకవరం గ్రామాల్లో రూ.3.75 కోట్ల నిధులతో చేపట్టిన సీసీ రోడ్లు, పంచాయతీ భవనాలు, పల్లె దవాఖానలు, బ్రిడ్జిల నిర్మాణాలకు స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి సోమవారం ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
అనంతరం కప్పలబంధం గ్రామంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతుల వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని చూస్తున్నదని విమర్శించారు. తెలంగాణలో ఈ విధానాన్ని అమలు చేయాలని ఒత్తిడి తెస్తున్నదని అన్నారు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, మీటర్లు పెట్టబోమంటూ స్పష్టం చేస్తున్నారని అన్నారు. అన్నదాతల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్న సీఎం కేసీఆర్.. రైతుబాంధవుడిగా నిలిచారని గుర్తుచేశారు. గ్రీన్ ఫీల్డ్ హైవేకు కల్లూరులో ఎగ్జిట్ లేకపోవడంతో మండల నాయకులు తమను సంప్రదించారని అన్నారు. దీంతో ఎమ్మెల్యే సండ్ర, నాయకులతో వెళ్లి ఢిల్లీలో కేంద్రమంత్రి గడ్కరీని కలిసి ఎగ్జిట్ మార్గాన్ని మంజూరు చేయించామని గుర్తుచేశారు. తదుపరి ఎన్నికల్లోనూ ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు.
ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ రూ.100 కోట్ల నిధులను మంజూరు చేశారని అన్నారు. వీటితో ప్రతి మండలంలోనూ సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, పల్లె దవాఖానలు, నూతన పంచాయతీ కార్యాలయ భవనాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కల్లూరు మండలాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. తొలుత కప్పలబంధంలో రూ.50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జిని, రూ.20 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. నూతన పంచాయతీ భవనానికి, కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
బత్తులపల్లి, గోకవరంలలో రూ.40 లక్షలతో సీసీ రోడ్లు, రూ.20 లక్షలతో పంచాయతీ భవనం నిర్మాణాలకు, పుల్లయ్యబంజరులో రూ.25 లక్షలతో సీసీ రోడ్లు, రూ.20 లక్షలతో పంచాయతీ భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అదే గ్రామంలో రూ.16 లక్షలతో నిర్మించిన పల్లె దవాఖానను, తూర్పు లోకవరంలో రూ.79 లక్షలతో నిర్మించిన బ్రిడ్జిని ప్రారంభించారు. రూ.20 లక్షలతో చేపట్టిన పంచాయతీ భవనం, రూ.5 లక్షలతో చేపట్టిన కల్వర్టు నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. పడమటి లోకవరంలో రూ.20 లక్షలతో సీసీ రోడ్లు, మరో రూ.20 లక్షలతో పంచాయతీ భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎంపీ నామా, ఎమ్మెల్యే సండ్ర కలిసి బత్తులపల్లిలో కంటివెలుగు శిబిరాన్ని వారు సందర్శించి ఓ వృద్ధురాలికి కంటి అద్దాలను అందజేశారు.