ఇల్లెందు రూరల్, డిసెంబర్ 12: కోల్బెల్ట్ కార్మికుల పక్షాన నిలబడి వారి పక్షపాతిగా పోరాడిన ఘనత టీబీజీకేఎస్దేనని ఆ సంఘం అధ్యక్షుడు టీ.వెంకట్రావు స్పష్టం చేశారు. కార్మికుల సంక్షేమంపై దృష్టి సారించిన ఏకైక గుర్తింపు సంఘం తమదేనని అన్నారు. జేకే ఓసీలో టీబీజీకేఎస్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు ఎస్.రంగనాథ్ అధ్యక్షతన మంగళవారం జరిగిన గేట్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. సింగరేణిలోని నాలుగు బొగ్గు బ్లాక్లను కేంద్ర ప్రభుత్వం వేలానికి పెట్టినప్పుడు అప్పటి సీఎం కేసీఆర్ అడ్డుకున్నారని గుర్తుచేశారు. ప్రైవేట్ వ్యక్తులు, టెండర్ వేసిన వారు రాకుండా టీబీజీకేఎస్ పోరాటం చేసిందని అన్నారు. నాటి కోల్బెల్ట్ ఎమ్మెలేలు, కార్మికులు కేంద్రంపై పోరాడి తెలంగాణ సత్తాను చాటారని గుర్తుచేశారు.
ఉత్పత్తి లేదన్న కారణంగా 21 ఇైంక్లెన్ మూసివేస్తారన్న ప్రచారం జరిగినప్పుడు కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వారు బదీలి కాకుండా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చొరవ చూపిందని, అప్పటి సీఎం కేసీఆర్ ఆ ఓసీని మళ్లీ తెరిపించారని అన్నారు. బదిలీలు, ప్రమోషన్లు తదితర అంశాలపై కార్మికుల పక్షాన నిలబడి రాజీలేని పోరాటం చేసిన ఘనత టీబీజీకేఎస్దేనని స్పష్టం చేశారు. ఈ నెల 27న జరిగే గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మికులు టీబీజీకేఎస్ను గెలిపించాలని విజప్తి చేశారు. సంఘం నాయకులు కోటయ్య, గౌస్మియా, బొల్లెందుల ప్రభాకర్, మేకల శంకర్రావు, రాము, ఆవుల శ్రీనివాస్, సతీశ్, సత్యనారాయణ, అజీజ్, శేఖర్, ప్రభాకర్, రామారావు, రాజయ్య, కాంతారావు, కలువల వెంకటేశ్వర్లు, రవి పాల్గొన్నారు.