ఖమ్మం, జూలై 3: ఖమ్మంలో కాంగ్రెస్ నిర్వహించిన సభ అట్టర్ ఫ్లాప్ అయిందని, రాహుల్ ప్రసంగం ముగిసిన రెండు నిమిషాల్లోనే ట్రాఫిక్ అంతా క్లియర్ కావడమే ఇందుకు నిదర్శనమని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు స్పష్టం చేశారు. జనగర్జన పేరిట నిర్వహించిన ఆ సభ కాంగ్రెస్ నాయకుల గర్జనగా ఉందని విమర్శించారు. ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయమైన తెలంగాణ భవన్లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సభకు పది రోజుల ముందు నుంచి లక్షలాది ప్రజలు హాజరవుతారని ప్రగల్బాలు పలికిన నాయకులు చివరికు సభ ఫెయిల్ కావడంతో నోరు మెదపడం లేదని ఎద్దేవా చేశారు.
సభలో మాట్లాడిన నాయకులందరూ తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఏంచేస్తారో చెప్పకుండా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, మంత్రి అజయ్కుమార్ను విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకున్నారని అన్నారు. డిసెంబర్ 9న ఖమ్మంలోనే విజయోత్సవ సభ నిర్వహిస్తామన్న పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి మాటలు విడ్డూరంగా ఉన్నాయని అన్నారు. గత శాసనసభ ఎన్నికలకు ముందు కూడా ఆనాటి కాంగ్రెస్ నాయకులు ఇదే మాట చెప్పారని, కానీ తరువాత ఏమైందో గుర్తుచేసుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్కు ఉమ్మడి జిల్లా ప్రజలు బ్రహ్మరథం పడుతున్న విషయాన్ని గుర్తుచేసుకోవాలని సూచించారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీకి తెలంగాణ సమాజం పట్ల, ఇక్కడి ప్రజల అవసరాల పట్ల అవగాహన లేదని విమర్శించారు. కుటుంబ పాలన అంటూ సీఎం కేసీఆర్ కుటుంబాన్ని విమర్శించే ముందు రాహుల్గాంధీ తాను ఏమిటో తెలుసుకోవాలని హితవు చెప్పారు.
నెహ్రూ ముని మనవడిగా, ఇందిరాగాంధీ మనవడిగా, రాజీవ్గాంధీ కుమారుడిగా తప్ప అంతకు మించి రాహుల్కు ఉన్న అర్హత ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. వృద్ధులకు, వితంతువులకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న రూ.2016 పింఛన్ను కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్కు ఒక జాతీయ విధానమంటూ ఉండదా? అని ప్రశ్నించారు. దివ్యాంగులకు రూ.3016 పింఛన్ ఇస్తున్న సీఎం కేసీఆర్.. ఏ ఒక్కరూ అడగకుండానే దానిని రూ.4116కు పెంచారని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ దార్శనికతకు ఇంతకంటే నిదర్శనం ఏముంటుందని అన్నారు. కాంగ్రెస్లో చేరిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభలో తన సొంత డబ్బా కొట్టుకున్నారని విమర్శించారు.
తన అనుచరులను, తన అభిమానులను మెచ్చుకున్న పొంగులేటి.. సభకు వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తల గురించి ఒక్కమాట కూడా మాట్లాడకపోవడం విచిత్రంగా ఉందని అన్నారు. ఉమ్మడి జిల్లాలో 1.60 లక్షల ఎకరాల పోడు భూములు సాగు చేసుకుంటున్న 62 వేల కుటుంబాలకు పట్టాలు ఇచ్చిన ఘనత కేసీఆర్దేనని స్పష్టం చేశారు. కానీ గజం భూమి అడిగినందుకు ముదిగొండ, ఇంద్రవెల్లిలో పేదలను కాల్చిచంపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మంలోని 10 స్థానాలనూ బీఆర్ఎస్ గెలుచుకోవడం ఖాయమని స్పష్టంచేశారు. గెలిచాక ఖమ్మంలో పెద్ద ఎత్తున సభ నిర్వహించేది కూడా తమ పార్టీయేనని అన్నారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, ఉద్యమకారులు ఉప్పల వెంకటరమణ, బచ్చు విజయ్కుమార్, పగడాల నాగరాజు, కమర్తపు మురళి, నల్లమల వెంకటేశ్వరరావు, చింతనిప్పు కృష్ణచైతన్య, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.