భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మూడు పాఠశాలల్లో ‘సీఎం బ్రేక్ఫాస్ట్’ పథకానికి మంగళం పలికారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 23 మండలాల్లో మండలానికి ఒకటి చొప్పున అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించింది. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రతి మండలంలో ఉన్న పాఠశాలలకు ఈ పథకాన్ని వర్తించాల్సింది పోయి అమలుచేసే పథకానికి మంగళం పలికేలా బిల్లులు రాకుండా చేస్తున్నది.
దీంతో పథకం అటకెక్కింది. జిల్లాలో ఇప్పటివరకు పాఠశాలల్లో వంటలు చేసే వర్కర్లకు రూ.11 లక్షలకు పైగా నగదు రావాల్సి ఉందని వారు లబోదిబోమంటున్నారు. ఉపాధ్యాయులు బిల్లులు వస్తాయి నడిపించండి అంటే బలవంతంగా నడిపిస్తున్నామని వారు ఆవేదన చెందుతున్నారు. సుజాతనగర్, పాల్వంచ, పినపాక మండలాల్లోని పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహారం పెట్టడం లేదు.