ఖమ్మం జిల్లాలో సాధారణ ఉష్ణోగ్రత 35 : డిగ్రీలు కాగా.. ఏప్రిల్, మే నెలల్లో ఈ ఎండల తీవ్రత మాత్రం అధికంగా ఉంటుంది. మార్చి నెల రెండోవారం నుంచే 35 డిగ్రీలకు చేరుకొని 40 డిగ్రీలకు చేరువలో నమోదవుతోంది. అయితే, మార్చి మొదటి వారంలోనే సాధారణానికి మించి మూడు డిగ్రీలు అధికంగా 38 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నెలంతా ఇదే విధంగా నమోదైంది. ఈ ఎండలను చూసి జనం బెంబేలెత్తిపోతున్నారు. వారం రోజులుగా నమోదవుతున్న ఉష్ణోగత్రల కారణంగా మిరప తోటలు ఏరుతున్న వ్యవసాయ కూలీలు, ఉపాధిహామీ పనులకు వెళ్లే కూలీలు ఇబ్బంది పడుతున్నారు.
ఉదయం పది నుంచి సాయంత్రం నాలుగు గంటలు దాటుతున్నా ఎండ వేడి తగ్గకపోవడంతో ప్రజలు ఇళ్ల నుంచి కాలు బయట పెట్టలేకపోతున్నారు. పిల్లలు, వృద్ధులు ఇంటి దగ్గర ఉన్నా ఫ్యాన్లు గాలికి తట్టుకోలేకపోతున్నారు. డయాబెటీస్ రోగుల బాధలు వర్ణణాతీతంగా ఉన్నాయి. ఎండకు షుగర్ పెరుగుతున్నందున నీడ నుంచి బయటకు రాలేని పరిస్థితి ఉంది. నాలుగైదు రోజుల్లో రోజుకో డిగ్రీ చొప్పున ఉష్ణోగ్రతలు పెరగడంతో ఎండల తీవ్రతకు ఇళ్లల్లోనూ చిన్నారులు, వృద్ధులు ఉండలేని పరిస్థితి కనిపించింది. ఇటీవల చిన్నపాటి వర్షం పడినా అది ఆ రోజుకే పరిమితమైంది. రానున్న రోజుల్లో ఎండలు ముదిరే అవకాశం ఉండటంతో ప్రజలు ఉపశమనం పొందేందుకు ఇళ్లతోపాటు ఆఫీసుల్లో వేసవి నేస్తాలను సమకూర్చుకుంటున్నారు. ఇప్పటికే కూలర్లు, ఏసీలను రిపేరు చేయించుకొని సిద్ధం చేసుకున్నారు.
ఉమ్మడి జిల్లా ప్రజలు ఎండకు తట్టుకోలేక శీతలపానీయాల విక్రయ కేంద్రాల వద్దకు పరుగులు తీస్తున్నారు. తాటి ముంజలు, పుచ్చకాయలు, కొబ్బరి బొండాలు, జ్యూస్ పాయింట్, చెరుకు రసం విక్రయ కేంద్రాల వద్దకు చేరుకొని తాపం తీర్చుకుంటున్నారు. అయితే వారం రోజుల నుంచి 40 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా అధికారులు తప్పుడు లెక్కలు చూపిస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సింగరేణి కార్మిక ప్రాంతాలైన కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు, సత్తుపల్లిలోని కిష్టారంలో కార్మికులతోపాటు వారి కుటుంబ సభ్యులు ఎండలకు తట్టుకోలేకపోతున్నారు. సింగరేణి వ్యాప్తంగా ఓసీల ద్వారా బొగ్గు వెలికి తీయడంతో అక్కడ కార్మికులకు సరైన రక్షణ చర్యలు లేకపోవడంతో నీటి కోసం అల్లాడిపోతున్నారు. బొగ్గు వెలికి తీసే ప్రాంతాల్లో పనిచేసే కార్మికులకు మజ్జిగ పంపిణీ చేయాల్సి ఉండగా.. యాజమాన్యం పట్టించుకోకపోవడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. వడదెబ్బ తగిలితే పరిస్థితి ఏమిటని ఇప్పటి నుంచే దిగులు చెందుతున్నారు. గని ప్రాంతాల్లో తమకు కనీస సౌకర్యాలు కల్పించాలని కాంట్రాక్టు కార్మికులు నిరసన తెలుపుతున్నారు. కార్మిక సంఘాలు యాజమాన్యాలపై ఒత్తిడి తెచ్చినా చర్యలు తీసుకోవడం లేదని పలువురు కార్మికులు ఆరోపిస్తున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎండలు మండుతున్నాయి. రోజురోజుకూ భానుడు తన ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. వేసవికాలం ప్రారంభమైన కొద్దిరోజులకే ఉష్ణోగ్రతలు పెరిగాయి. గడిచిన నాలుగైదు రోజులుగా జిల్లాలో సాధారణ ఉష్ణోగ్రతలకు మించి ఎండల తీవ్రత అధికంగా నమోదవుతోంది. ఈ ఎండలు నిరుటితో పోల్చితే ఎక్కువగానే అనిపిస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వారం రోజులుగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరాయి. భానుడి ప్రతాపానికి నగర ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఎండలు ముదరడంతో బోరుబావుల్లో జలాలు తగ్గిపోయి పొలాలు ఎండుతున్నాయి. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
– భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ రఘునాథపాలెం, ఏప్రిల్ 3