భద్రాద్రి కొత్తగూడెం, మే 26 (నమస్తే తెలంగాణ) : ఎండాకాలం చివరిరోజులు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. భానుడి ఉగ్రరూపానికి జనం విలవిలలాడుతున్నారు. రోహిణి కార్తె ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నది. కాసేపు కూడా చల్లదనం ఉండడం లేదు. ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. వృద్ధులు, చిన్నపిల్లలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో వారంరోజులుగా ఇదే పరిస్థితి కనపడుతున్నది. రికార్డుస్థాయిలో 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రతిరోజూ 43 డిగ్రీలకు తగ్గడం లేదు. భద్రాచలం, ఇల్లెందు, మణుగూరు, అశ్వారావుపేట, కొత్తగూడెం నియోజకవర్గాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. బొగ్గుబావులు ఉన్న మణుగూరు, ఇల్లెందు, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల్లో కార్మికులు ఎండలకు తాళలేకపోతున్నారు. అత్యవసర పని మీద బయటకు వస్తున్న జనం ఉదయం పది దాటకముందే ఇండ్లకు చేరుకుంటున్నారు.
చలివేంద్రాల వద్దకు పరుగులు :ఎండవేడికి తట్టుకోలేక జనం అల్లాడిపోతున్నారు. చలివేంద్రాలు ఎక్కడ కనబడితే అక్కడికి పరుగులు తీస్తున్నారు. కొత్తగూడెం ఆర్టీసీ బస్టాండ్లో ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రయాణికుల దాహార్తిని తీరుస్తున్నది. జీఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ప్లాంట్ చల్లని నీటిని అందిస్తున్నది. పరిసర ప్రాంతవాసులు కూడా అక్కడి కూల్వాటర్ పట్టుకుంటున్నారు. మరోవైపు ప్రధాన కూడళ్లిలో కూడా ట్రస్ట్ నిర్వాహకులు చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. భద్రాచలం, పాల్వంచ, ఇల్లెందు, మణుగూరు ప్రాంతాల్లో మున్సిపల్ అధికారులు, స్థానిక సంస్థలు చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. సత్యసాయి సేవా సంస్థ బస్టాండ్లో రెండ్రోజులకోసారి మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. ప్రతిరోజు ఉదయం పది గంటలకు 43 డిగ్రీల ఉష్ణోగ్రతల నుంచి పైకి వెళ్తున్నది. మధ్యాహ్నం షాపులు బంద్..
పది దాటితే జనం బయటకు రాకపోవడంతో షాపులు బంద్ చేస్తున్నారు. ఎండకు తట్టుకోలేక షాపు యజమానులు కూడా ఇంటిముఖం పడుతున్నారు. ప్రధాన కూడళ్లలో షాపులు ఎదురు ఎండకు తాళం వేసుకుని ఇంటికి చేరుతున్నారు. ఉపాధి కోసం మార్కెట్లో వ్యాపారం చేసుకుంటున్న వ్యాపారులు మాత్రం ఎండను తట్టుకోలేక నీడలో ఉంటూ వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇక ఆకుకూరలు మాత్రం ఎండక వడిలిపోవడంతో వ్యాపారులు రాత్రులు మార్కెట్లో వదిలివెళ్తున్నారు. పశువులు ఎండకు తట్టుకోలేక నీడపట్టుకు వెళ్తున్నాయి.