లోతైన దుక్కులతో బహుళ ప్రయోజనాలు
భూసారం, తేమశాతం అభివృద్ధికి దోహదం
కలుపు నివారణకు మార్గం సుగమం
ఖమ్మం వ్యవసాయం, జూన్ 6 : వానకాలం సీజన్ ప్రారంభానికి ముందు వేసవిలో దుక్కులను దున్నుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయంటున్నారు వ్యవసాయశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు. రైతులు వానకాలం, యాసంగి పంటలను తీసుకున్న తర్వాత మళ్లీ వర్షాకాలం వరకు భూమిని దున్నకుండా వదిలేస్తుంటారు. దీంతో కలుపు మొక్కలు పెరిగి భూమిలోని నీటిని, పోషక పదార్థాలను గ్రహించడం వల్ల భూమిలో సత్తువ లేకుండా పోతుంది. తద్వార భూసారం తగ్గిపోవడమే కాకుండా నీరు భూమిలోని లోపలి పొరల నుంచి గ్రహించబడి ఆవిరైపోయే ప్రమాదం ఉంది.
లోతైన దుక్కులతో ప్రయోజనం
వేసవి కాలంలో దుక్కులు దున్నుకుంటే పుడమికి పుట్టెడు లాభాలు కలుగుతాయి. రైతులు పంటకోత అనంతరం పొలాన్ని వదిలేయడం వల్ల తొలకరి వర్షాలు పడగానే నీరు భూమిలోకి ఇంకిపోకుండా బయటకు వెళ్తుంది. వర్షాలకు ముందే భూమిని దున్నటం వల్ల తొలకరి వర్షాలు పడగానే నీరు భూమిలోకి ఇంకి భూమి కోతకు గురికాకుండా ఉంటుంది. లోతు దుక్కుల వల్ల భూమి పైపొరలు కిందికి, కింది పొరలు పైకి తిరగబడి నేల సారవంతంగా మారుతుంది. ఇలా చేయడం వల్ల భూమిలో తేమశాతం పెరిగి, భూసారం అభివృద్ధి, పురుగులు, తెగుళ్ల యాజమాన్యం, కలుపు మొక్కల నివారణ వగైరా ప్రయోజనాలు సమకూరుతాయి. వేసవి దుక్కులు దున్నే ముందు పశువుల పెంటపోగు, కంపోస్టు ఎరువు, మట్టిని వెదజల్లడం ద్వారా సారవంతమైన పంట దిగుబడితోపాటు తేమశాతం పెరుగుతుంది.
సమృద్ధిగా భూసారం
వేసవిదుక్కులు లోతుగా, వాలుకు అడ్డంగా దున్నుకోవాలి. వాలుకు అడ్డంగా దున్నుకోవడం వల్ల వాన నీరు భూమిలోకి ఇంకేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడడంతోపాటు భూమి ఎక్కువ తేమను గ్రహించి నిల్వ చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది. దీని ప్రభావం వలన పంట దిగుబడి మీద కేంద్రీకృతమవుతుంది. వేసవి దుక్కులు దున్నేముందు పొలంలో గొర్రెలను, పశువుల మందలు తోలటం వల్ల అవి విసర్జించే వ్యర్థాలు భూమిలోకి చేరి సేంద్రియ పదార్థం తయారవుతుంది. తద్వార భూసారం వృద్ధి అవుతుంది. పశువుల పెంటపోగు, కంపోస్టు ఎరువు, చెరువులోని మట్టని వెదజల్లటం వల్ల నేల సారవంతమై పంట దిగుబడి పెరగడంతోపాటు తేమశాతం పెరుగుతుంది. సాధారణంగా రైతులు పంట చేతికందగానే పంటల నుంచి వచ్చే ఎండు ఆకులు, చెత్త, చెదారం కాల్చివేయకుండా అవకాశమున్నవారు లోతుదుక్కులు చేయడం వల్ల పంట చెత్త,చెదారం, ఎండు ఆకులు నేల పొరల్లో కలిసి పోయి చీకి ఎరువుగా మారి భూసారం పెరిగి పంటకు కావాల్సిన పోషక పదార్థాలు పుష్కలంగా లభిస్తాయి.
చీడపీడల బెడదకు చెక్
వేసవికాలంలో చాలావరకు భూమి ఖాళీగా ఉంటుంది. అలాంటి సమయంలో పంటలను ఆశించే అనేక రకాల పురుగులు పంటకోత దశల్లో వాటి నిద్రావస్థ దశలను నేల, చెత్తాచెదారం, కొయ్యకాడల్లో గడుపుతాయి. తెగుళ్లను కలుగజేసే శిలీంధ్రాలు తదితర భూమిలోపల ఆశ్రయం పొందుతాయి. వీటి శిలీంధ్ర బీజాలు భూమిలో నిల్వ ఉంటాయి. వేసవి లోతు దుక్కుల వల్ల నిద్రావస్థ దశలో భూమిలో ఉన్న చీడ పురుగుల కోశాలు గుడ్లు, లార్వాలు, గుడ్లను పక్షులు, కొంగలు, కాకులు, తిని నాశనం చేస్తాయి. అదేవిధంగా వేసవి దుక్కల వల్ల భూమిలోపల పొరల్లో ఉన్న శిలీంధ్ర బీజాలు మట్టితోపాటు నేలపైకి వస్తాయి. ఇవి అధిక ఉష్ణోగ్రతకు గురై వ్యాధి కలుగజేసే శక్తిని కోల్పోతాయి.
వ్యవసాయ పనులు షురూ..
తిరుమలాయపాలెం : మండలంలో వానకాలం వ్యవసాయ పనులు ప్రారంభమయ్యాయి. రైతులు భూములను దున్ని సాగుకు సిద్ధం చేస్తున్నారు. రుతుపవనాలు త్వరలో రాష్ట్రంలో ప్రవేశించనుండడంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. తిరుమలాయపాలెం మండలం భౌగోళిక విస్తీర్ణం 28,433 హెక్టార్లు. సాగు భూమి 13,941 హెక్టార్లు, నీటి పారుదల వ్యవసాయ భూమి 3539 హెక్టార్లు, వర్షాధారంగా సాగయ్యే మెట్ట భూమి 10,402 హెక్టార్లు. మండలంలో సాధారణ వర్షపాతం 1033 సెంటీమీటర్లు. మండలంలో రైతులు పత్తి, మిర్చి పంటలనే అధిక విస్తీర్ణంలో సాగు చేయడం ఆనవాయితీ. పత్తి సాగు సాధారణ విస్తీర్ణం7,004 హెక్టార్లు కాగా రెండేళ్లుగా పత్తిలో పుచ్చు వస్తుండడంతో తక్కువ విస్తీర్ణంలో సాగు చేశారు. మండలంలో మిర్చి సాధారణ సాగు విస్తీర్ణం 2,007 హెక్టార్లుకాగా ఈ ఏడాది తగ్గే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈసారి పత్తి సాగు పెరిగే అవకాశం ఉన్నట్లు మండల వ్యవసాయాధికారి ఎన్.సీతారామరెడ్డి తెలిపారు.
కలుపు నివారణకు దోహదం
సాధారణంగా మన రైతులు సీజన్కు ముందుగా వేసవి దుక్కులను తయారు చేసుకోకపోవడంతో కలుపు నివారణకు అదనపు భారం పడుతుంది. పంటలేని సమయంలో కలుపు మొక్కలు పెరుగుతాయి. ఈ కలుపు మొక్కలు నేలలోని నీరు, పోషకాలను ప్రత్యక్షంగా గ్రహించి పంట దిగుబడిని తగ్గిస్తాయి. అంతేకాకుండా అనేకరకాల పురుగులు, శిలీంధ్రాలకు ఆశ్రయాన్ని కల్పించడం ద్వారా పరోక్షంగా పంటనష్టానికి కారణమవుతాయి. కాబట్టి వేసవి లోతుదుక్కుల వల్ల లోతుకు పాతుకుపోయిన కలుపుమొక్కలు వాటి విత్తనాలు నేలపై పొరల్లోకి చేరడం వల్ల అధిక ఉష్ణోగ్రతకు గురై నశిస్తాయి. దీనివల్ల తదుపరి పంటలో కలుపుతాకిడి తక్కువగా ఉంటుంది.