మామిళ్లగూడెం, జనవరి 9: ఓ మహిళ క్షణికావేశం తన ప్రాణంతోపాటు నవమాసాలు మోసిన కూతురి ప్రాణాలను గాలిలో కలిపింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఇంట్లో నుంచి బయటకు వచ్చిన సదురు మహిళ తన 18నెలల చిన్నారితో కలిసి మున్నేరులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఖమ్మం నగరంలో సోమవారం వెలుగుచూసింది. ఖమ్మం మూడో పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేలకొండపల్లి మండలం పైనంపల్లి గ్రామానికి చెందిన ఉడతల ఉమారాణి(23) ఆదివారం అత్తతో గొడవ పెట్టుకుని ఇంట్లో నుంచి చిన్నకూతురు యశ్వశ్రీవైవిజ్ఞతో బయటకు వచ్చింది. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు నేలకొండపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. నేలకొండపల్లి నుంచి ఖమ్మం చేరుకున్న సదురు మహిళ సాయంత్రం సుమారు 5:30 సమయంలో కాల్వొడ్డు ప్రాంతంలో ఉండగా అదే గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ గమనించాడు.
కుటుంబ సభ్యులపై కోపంతో ఉన్న మహిళ ఆవేశంలో మున్నేరులో కూతురుతో పాటు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. సోమవారం మున్నేరులో తేలుతూ కనిపించిన తల్లీకూతుళ్ల మృతదేహాలను స్థానికుల సమాచారం మేరకు పోలీసులు బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతదేహాలను బంధువులకు అందజేసినట్లు మూడో పట్టణ సీఐ పి. సర్వయ్య తెలిపారు.