కూసుమంచి, అక్టోబర్ 17: కృష్ణా బేసిన్లో ఈసారి సరైన వర్షాలు లేవు. దీంతో తెలంగాణ ఏర్పడిన ఈ తొమ్మిదేళ్లలో ఈ సారి మాత్రమే మొదటి పంటలకు నీరు ఇవ్వలేకపోయిన పరిస్థితి ఏర్పడింది. కానీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో సాగర్ జలాలు ఇవ్వడానికి అవకాశం లేకపోయినా ప్రభుత్వం కొంతవరకు నీటిని విడుదల చేసింది. అటు బయ్యన్నవాగు ద్వారా గోదావరి జలాలను పాలేరులో వదిలింది. దీంతో పాలేరు ఆయకట్టు కింది పంటల సాగుకు ఈ సారి ఢోకా లేకుండా పోయింది.
పాలేరు ఆయకట్టు పంటలకు నీటిని అందించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించడం జిల్లా రైతులకు వరంగా మారింది. గోదావరి జలాలు పాలేరుకు రావడంతో వేసిన పంటలకు నష్టం జరుగకుండా ఇరిగేషన్ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.జిల్లాలోని 17 మండలాల్లో 1.5 లక్షల ఎకరాల్లో వరి, 2.5 లక్షల ఎకరాల్లో ఆరుతడి పంటలు పాలేరు రిజర్వాయర్ కింద సాగవుతాయి. జిల్లాలోని లక్షలాది మంది రైతులు పాలేరు జలాశయంపై ఆధారపడి వ్యవసాయం చేస్తుంటారు. ఈ పరిస్థితుల్లో కృష్ణా బేసిన్లో ఏర్పడిన వర్షాభావ పరిస్థితి వల్ల మొదటి పంటకు నీరు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది.
అయితే రైతులు లక్షన్నర ఎకరాల్లో వివిధ రకాల పంటలు వేశారు. వేసవి కంటే ఎక్కువగా ఉన్న ఎండలతో పంటలకు నీరు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఏర్పడింది. సీఎం కేసీఆర్ స్వయంగా ఇరిగేషన్ అధికారులతో సమావేశమై ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాల రైతుల పంటలు కాపాడేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. దీంతో జిల్లా ఇరిగేషన్ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. దీంతో 5 టీఎంసీల నీటిని ఇవ్వడానికి కిృష్ణా బోర్డు అనుమతితో రోజుకు 0.5 టీఎంసీల నీటిని సాగర్ నుంచి వదులుతూ 10 రోజుల పాటు నీరు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ ప్రవాహం ఈ నెల 9 నుంచి వస్తుండడంతో అదేస్థాయిలో దిగువన గల రైతుల పంటలకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం చివరి ఆయకట్టు కల్లూరు నుంచి క్రంగా దిగువకు నీటిని వదిలే విధంగా అన్ని యూటీలు కాలువలు తెరిచి నీటిని వదులుతున్నారు.
సాగర్ జలాలు స్వల్ప మోతాదులోనే వస్తున్నందున 72 కిమీ దూరం నుంచి పాలేరుకు గోదావరి జలాలనూ అందిస్తోంది బీఆర్ఎస్ ప్రభుత్వం. బయ్యారం రిజర్వాయర్ బయ్యన్న వాగు ద్వారా ఉర్లుగొండ వద్ద పాలేరు రిజర్వాయర్లో గ్రావిటీతో చేర్చుతోంది. దీంతో ప్రస్తుతం కృష్ణా జలాలు, గోదావరి జలాలు రావడంతో పాలేరు నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది.