ఖమ్మం : ఖమ్మం నియోజకవర్గంలో ఏకైక మండలంగా ఉన్న రఘునాథపాలెం అభివృద్దికి రూ.6కోట్ల సుడా నిధులు కేటాయించినట్లు స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(సుడా) చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ తెలిపారు. గ్రామాల అవసరాల ప్రాతిపధికన సమస్యలను గుర్తించి ఈ నిధులను కేటాయించడం జరుగుతుందని ఆయన అన్నారు. ఇందుకు రాష్ట్ర రవాణాశాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశాల మేరకు మండలంలోని అన్ని గ్రామాల్లో పర్యటించి ప్రధాన సమస్యలను గుర్తిస్తున్నట్లు చెప్పారు. మంగళవారం మండల ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన శివాయిగూడెం, ఈర్లపూడి, పంగిడి, మంగ్యాతండా,కేవీ బంజర, మూలగూడెం,రజబ్ అలీనగర్, ఎన్వీ బంజర, దొనబండ, లచ్చిరాంతండా గ్రామాల్లో విస్త్రృతంగా పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ..మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశాల మేరకు మండల అభివృద్దికోసం సుడా నిధులను కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే వీ.వెంకటాయపాలెం, రఘునాథపాలెం, మంచుకొండ, బల్లేపల్లి ప్రాంతాల్లో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు నిమిత్తం రూ.6కోట్ల నిధులు కేటాయించడం జరిగిందన్నారు. తాజాగా రఘునాథపాలెం మండలంలోని అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి రూ.4కోట్లు వెచ్చించడం జరుగుతోందన్నారు. మండలంలోని ప్రతి గ్రామానికీ సుడా నిధులు కేటాయించడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు అజ్మీరా వీరూనాయక్, మాజీ అద్యక్షుడు కుర్రా భాస్కర్రావు, ప్రధాన కార్యదర్శి తాతా వెంకటేశ్వర్లు, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ పిన్ని కోటేశ్వరరావు, మహిళా విభాగం మండల అద్యక్షురాలు బానోతు ప్రమీల, ఎస్టీ సెల్ మండలాధ్యక్షుడు ధరావత్ రామ్మూర్తి నాయక్, ఎస్టీ సెల్ ఉపాద్యక్షుడు గుగులోతు ప్రవీణ్ నాయక్, యూత్ ఉపాద్యక్షులు మొగిలిశెట్టి నరేష్, కార్యదర్శి గుగులోతు శ్రీనివాస్, ప్రచార కార్యదర్శి రంజీత్ నాయక్, బీసీసెల్ ప్రధాన కార్యదర్శి గందసిరి వీరభద్రం, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.