పాల్వంచ రూరల్, నవంబర్ 29 : విద్యార్థులు వారు పాల్గొనే ఏ క్రీడలో అయినా క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి విజయం కోసం పోరాడాలని ఐటీడీఏ ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ రమాదేవి అన్నారు. పాల్వంచ మండలంలోని కిన్నెరసాని స్పోర్ట్స్ పాఠశాలలో కొనసాగుతున్న 6వ ఇంటర్ సొసైటీ లీగ్ పోటీలకు మంగళవారం ఆమె ముఖ్యఅతిథిగా హాజరై పలు క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు.
అనంతరం క్రీడాకారులతో మాట్లాడుతూ.. రాష్టంలోని ఏడు సొసైటీల నుంచి 3,200 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారని, వారు గత టోర్నమెంట్లలో తమ నైపుణ్యం ప్రదర్శించి రాష్ట్రస్థాయి పోటీల్ల్లో పాల్గొంటున్నారన్నారు. క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనపరిచినప్పుడే విజేతలుగా నిలుస్తారన్నారు. పోటీల్లో గెలుపోటములు సహజం అని, ఒడినవారు మరోసారి గెలుపునకు ప్రయత్నించాలన్నారు. వేలాది మంది క్రీడాకారులను ఒకటిగా చేసిన ఈ వేదిక విద్యార్థుల్లో స్నేహభావాన్ని పెంపొందిస్తుందని అన్నారు. ప్రభుత్వం గురుకులాల పట్ల ప్రత్యేక శ్రద్ధతో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నదని, క్రీడాకారులు వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. గురువారంతో పోటీలు ముగుస్తాయన్నారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిన క్రీడాకారులను ఆమె అభినందించారు. కార్యక్రమంలో ఖమ్మం డీటీడీవో కృష్ణానాయక్, బాక్సింగ్ కోచ్ ఓంకార్, శంకర్, క్రీడల అధికారి వీరూనాయక్, రమణయ్య, ఏటిడబ్ల్యూవో లు నరసింహారావు, తిరుమలరావు, చంద్రమోహన్, రుపాదేవి తదితరులు పాల్గొన్నారు.